5G services Launch : భారత్ లో 5G శకం ప్రారంభం-త్వరలో జియో, ఎయిర్ టెల్ ప్లాన్ల ప్రకటన
భారత టెలికాం రంగంలో 5జీ సేవల శకం ప్రారంభమైంది. ఇప్పటివరకూ గరిష్టంగా 4జీ సేవల్ని మాత్రమే వాడుతున్న వినియోగదారులకు దాదాపు 100 రెట్ల వేగాన్ని పరిచయం చేస్తూ ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ ఢిల్లీలోమి ప్రగతి మైదాన్ లో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీతో కలిసి ప్రధాని మోడీ 5జీ సేవల్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలోని 9 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
భారత్ లో 5జీ శకం ప్రారంభం
భారత టెలికాం రంగ భవిష్యత్తును కొత్త పుంతలు తొక్కిస్తుందని అంచనా వేస్తున్న 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు 5జీ సేవల్ని ఇవాళ ప్రధాని మోడీ ముంబైలో లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నిర్వహించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని మోడీ వీటిని ప్రారంభించారు.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ ను ప్రారంభించిన మోడీ.. ఇందులో 5జీ సేవల్ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్టెల్, రిలయన్స్ జియో, క్వాల్కామ్ వంటి అనేక అగ్ర కంపెనీలు తమ 5G సేవలతో పాటు దాని ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించాయి.
దీపావళి నుంచి 5జీ సేవలు
భారత్ లో 5జీ సేవల్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించినా.. ఈ ఏడాది దీపావళి నాటికి వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే భారత ప్రైవేటు టెలికాం రంగంలో పోటాపోటీగా ఉన్న జియో, ఎయిర్ టెల్ సంస్ధలు దీపావళి నాటికి ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. భారత్ లోని 9 నగరాల్లో ప్రస్తుతానికి ఈ సేవలు అందుబాటులోకి రానుండగా.. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో దీపావళి నుంచి డిసెంబర్ లోపు దాదాపు భారత్ అంతా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
సరసమైన ధరలకే ఇస్తామన్న అంబానీ
5జీ సేవల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ జియో "ప్రపంచంలో మరెవరికీ లేని నాణ్యమైన, సరసమైన ధరలకు ఈ సేవలు అందిస్తుందని ప్రకటించారు. డిసెంబర్ 2023 నాటికి భారత్ లోని ప్రతి మూలకు 5Gని అందిస్తామని అంబానీ హామీ ఇచ్చారు. 5G తొలుత ఎంపిక చేసిన మెట్రో నగరాల్లో అందుబాటులోకి వస్తుందని, దీంతో ప్రజలు 4G కంటే 10 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని పొందుతారని అంబానీ పేర్కొన్నారు. సెకనుకు గరిష్టంగా 20జీబీపీఎస్ లేదా సెకనుకు 100ఎంబీపీఎస్ కంటే ఎక్కువ డేటా వేగాన్ని అందిస్తుందని వెల్లడించారు.
త్వరలో జియో,ఎయిర్ టెల్ ప్లాన్లు
భారత్ లో 5జీ సేవలు ప్రారంభం కావడంతో ఇక ప్రధాన టెలికాం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్ టెల్ తమ ప్లాన్లు విడుదల చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తామని ఆపరేటర్లు ప్రకటించారు. దీంతో జియో, ఎయిర్టెల్ వంటి ప్రధాన టెలికాం కంపెనీలు తొలుత ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైతో సహా నాలుగు నగరాల్లో 5జీని విడుదల చేయనున్నాయి. అయితే ఈ నగరాల్లో సైతం అందరికీ ఈ సేవలు వెంటనే అందుబాటులోకి రావని తెలుస్తోంది. ఈ నగరాల్లోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో మాత్రం 5జీ సేవలు దీపావళి నుంచి అందుబాటులోకి వస్తాయి.
130 కోట్ల భారతీయులకు గిఫ్ట్ అన్న మోడీ
ఢిల్లీలో 5జీ సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఇది 130 కోట్లమంది భారతీయులకు టెలికాం రంగం ఇచ్చిన బహుమతిగా అభివర్ణించారు. భారత్ లో కొత్త శకానికి, అపరిమిత అవకాశాలకు ఇది ఆరంభమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇవి చరిత్రలో నిలిచిపోయే క్షణాల్ని మోడీ తెలిపారు.
భారత్ లో 21 వ శతాబ్దంలో ఇదో చారిత్రక దినమని, టెలికాం రంగంలో ఇది విప్లవం వంటిదన్నారు. దేశంలోని మారుమూలన ఉన్న స్కూళ్లు కూడా 5జీ పరిజ్ఞానంతో ఇప్పుడు అనుసంధానం అవుతాయని ప్రధాని తెలిపారు. తాను ఆత్మనిర్భర్ తీసుకొస్తే దేశంలో చాలా మంది నవ్వారని, ఇప్పుడు 5జీ రాక దానితోనే సాధ్యమైందన్నారు.