నూడుల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: ఆరుగురు మృతి, 12 మందికి తీవ్రగాయాలు
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్లో నూడుల్స్ తయారీ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది.
ఈ ఫ్యాక్టరీ ముజఫర్పూర్ లోని బేలా ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉంది. ప్రమాదం జరిగే సమయంలో ఆ ఫ్యాక్టరీలో ఎంత మంది పనిచేస్తున్నారన్న సమాచారం కూడా తెలియరాలేదు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఫ్యాక్టరీలోని బాయిలర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది.
ఈ శబ్ధం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్తానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేశారు.