కేదార్నాథ్లో కుప్పకూలిన హెలికాప్టర్: ఇద్దరు పైలెట్లతోపాటు ఆరుగురు యాత్రికుల మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్కు సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు పైలట్లతోపాటు యాత్రికులు ఉన్నారు.
వాతావరణం అనుకూలించని కారణంగానే హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేదార్నాథ్కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని గరుడ్ ఛాటి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆర్యన్ హెలికాప్టర్లో యాత్రికులు సహా ఆరుగురు ఉన్నారు. గుప్తకాశీ నుంచి బయలుదేరి కేదార్నాథ్కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇతర శాఖ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు పైలట్లు, నలుగురు యాత్రికుల మృత దేహాలను ఘటనా స్థలంలో గుర్తించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హెలికాప్టర్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు, ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్రమంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.