అయిదు నిమిషాల్లో మనం చనిపోతున్నాం- లాక్డ్ కారులో
Haryana: హర్యానాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుమంది ఆత్మహత్య చేసుకున్నారు. విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. విషయం సేవించినప్పటికీ- అతను తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
మృతులను ప్రవీణ్ మిట్టల్, ఆయన కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వారి స్వస్థలం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడున్. భాగేశ్వర్ ధామ్ లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రవీణ్ మిట్టల్.. తన తల్లిదండ్రులు, భార్య, కొడుకు, కూతురితో కలిసి కారులో మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ కు బయలుదేరారు.

భాగేశ్వర్ ధామ్ ను సందర్శించిన అనంతరం డెహ్రాడున్ కు తిరుగుముఖం పట్టారు. దారిలో పంచ్ కులా సెక్టార్ 27 పార్కింగ్ స్థలంలో కారులోనే విషాన్ని సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. సుమారు గంట తరువాత స్థానికులు ఈ కారును గుర్తించారు. అందులో ఉన్న వాళ్లు నిర్జీవంగా కనిపించడంతో అద్దాలు పగులగొట్టి వారిని బయటికి తీశారు.
అప్పటికే ప్రవీణ్ మిట్టల్ సహా మరో అయిదుమంది మరణించారు. మరొకరు కొస ప్రాణాలతో బయటపడ్డారు. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలను వెల్లడించారు. అప్పుల బాధ, వ్యాపారంలో తీవ్ర నష్టాలను భరించలేక కుటుంబం మొత్తం విషం సేవించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
జీవితంలో చివరిసారిగా భాగేశ్వర్ ధామ్ ను సందర్శించాలని, అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లామని చెప్పారు. డెహ్రాడూన్ కు తిరిగి వెళ్తూ ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు వివరించారు. డెహ్రాడూన్ కు వెళ్లిన తరువాతా తమ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండబోదనే నిరాశకు గురయ్యామని అన్నారు.
విషాన్ని సేవించిన అనంతరం- ప్రవీణ్ మిట్టల్ తమతో చివరిసారిగా మాట్లాడాడని, అయిదు నిమిషాల్లో అందరం చనిపోబోతోన్నామని తెలియజేశాడని చెప్పారు. అప్పటికే మానసికంగా సిద్ధం అయ్యామని, ఎలాంటి ఒత్తిడికీ లోను కాకుండా ఉండటానికి ప్రయత్నించామని పేర్కొన్నారు.
ఈ ఘటనపై పునీత్ అనే స్థానికుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ ఇంటి ఎదురుగా కారును పార్క్ చేసి ఉంచడాన్ని గుర్తించిన స్థానికులు మొదట వారితో మాట్లాడగా.. భాగేశ్వర్ బాబా కార్యక్రమానికి వెళ్లి వస్తోన్నామని, హోటల్ దొరక్క పోవడం వల్ల కారులో నిద్రపోతున్నామని చెప్పారని తెలిపారు.
కారును వేరే చోట పార్క్ చేయమని చెప్పామని, కారులో ఉన్న వారిలో ఒకరు వాంతి చేసుకోవడాన్ని గమనించి, అతన్ని బయటికి తీశామని పునీత్ విలేకరులకు చెప్పారు. సమాచారం అందిన వెంటనే పంచ్ కులా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.












Click it and Unblock the Notifications