డీకే శివకుమార్ మార్క్: నూతన శాఖ ఆవిర్భావం: మంత్రులకు బిగ్ టాస్క్: ఇకపై
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారథ్యంలోని కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఊహించిన అడుగు వేసింది. ప్రజల సమస్యలను త్వరితగతిన, సమర్థవంతంగా పరిష్కరించే దిశగా ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులు, వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటికి వేగంగా పరిష్కారించేందుకు వీలుగా ఓ నూతన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ప్రజా సేవ మంత్రిత్వ శాఖ పేరుతో ఇది తెరపైకి రానుంది.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నూతన శాఖ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిని కూడా నియమించబోతున్నట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా ప్రజలు ఎదుర్కొనే అత్యవసర సమస్యలకు తగిన రీతిలో ప్రత్యామ్నాయాలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశమని వివరించారు.

ఈ నూతన ప్రజా సేవ శాఖ రోజువారీ నిర్వహణ బాధ్యతలను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తారని, దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాల అమలులో మరింత పారదర్శకత పెరుగుతుందని డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలోని మంత్రులలో ఎవరికి ప్రజలు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, వాటన్నింటినీ నేరుగా ఈ ప్రత్యేక ప్రజా సేవ శాఖకే బదిలీ అవుతుంది. అక్కడ అర్జీల ప్రాధాన్యత, తీవ్రత ఆధారంగా వాటిని ప్రత్యేక వర్గాలుగా విభజించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కచ్చితమైన వ్యూహాన్ని అమలు చేస్తారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విధిగా పర్యటించాల్సి ఉంటుంది. వారానికి ఒక రోజైనా ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యులను కూడా కలుపుకొని ఆయా ప్రాంతాలలో 'జనస్పందన' కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్షేత్రస్థాయి సమావేశాల ద్వారా కఠినమైన సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చే ప్రత్యేక వీలుంటుంది.
ఈ జనస్పందన సభలలో ప్రజల నుంచి సేకరించిన ప్రతి దరఖాస్తును ఈ నూతనంగా ఏర్పాటయ్యే 'ప్రజా సేవ' విభాగంలో డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు. అనంతరం ఉన్నతాధికారులు వాటిని నిరంతరం సమీక్షిస్తూ తగిన పరిష్కారాలు కల్పిస్తారు. నియోజకవర్గాల వ్యాప్తంగా మంత్రులు పర్యటించడం వల్ల క్షేత్రస్థాయి పరిపాలనలో ఉండే లొసుగులు త్వరగా బయటపడతాయని, అదే సమయంలో స్థానిక సమస్యల పరిష్కారంలో త్వరితగతిన పురోగతి సాధించవచ్చని భావిస్తున్నారు.
ఈ నూతన పాలనా సంస్కరణ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగంలో బాధ్యతాయుత ప్రవర్తన మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రజలు తమ చిన్న చిన్న సమస్యల కోసం కూడా వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే గొడుగు కింద అన్ని రకాల ప్రభుత్వ సేవల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం లభించేలా ఈ విభాగం ఒక చక్కని వేదికగా నిలవనుంది. సుపరిపాలన దిశగా ఈ ప్రత్యేక శాఖ భవిష్యత్తులో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications