ఒకే టవల్ తో 12 మందికి కటింగ్.. బార్బర్ షాపులో వైరస్ వ్యాప్తి.. రిలాక్సేషన్స్ వేళ షాకింగ్..
ఎప్పుడెప్పుడు బార్బర్ షాపులు తెరుస్తారా.. ఠక్కున వెళ్లి కటింగ్ చేయించుకుందామా.. అని ఎదురుచూస్తోన్నవాళ్లకు ఇదొక షాకింగ్ హెచ్చరిక. మనిషి జీవితం 'కరోనాకు ముందు- కరోనా తర్వాత' అన్నట్లు తయారైనా, ఆ తేడాను గుర్తించకుండా, పాత పద్ధతిలోనే ఒకే టవల్ తో 12 మందికి కటింగ్, షేవింగ్ చేశాడో బార్బర్. ఫలితంగా ఆరుగురు కస్టమర్లకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ దుకాణంతోపాటు ఊరు మొత్తాన్నీ అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా భారీ మార్పులకు కూడా కారణమైంది.
Recommended Video

అలా వ్యాపించింది..
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నా, మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాల్లో బార్బర్ షాపులు బాజాప్త తెరుచుకున్నట్లు రిపోర్టులు ఉన్నాయి. అత్యధిక జనాభా ఉన్న జిల్లాల్లో ఒకటైన ఖర్గోన్(పాత ఖండ్వా జిల్లా)లో బర్గావ్ అనే ఊళ్లో బార్బర్ షాప్ ద్వారా వైరస్ వ్యాపించినట్లు గుర్తించామని జిల్లా వైద్య అధికారి దివ్వేశ్ వర్మ మీడియాకు చెప్పారు. ఇండోర్ లో పనిచేస్తూ, లాక్ డౌన్ కారణంగా ఇంటికి వచ్చిన వ్యక్తి కరోనా కాటుకు గురయ్యానన్న సంగతి తెలియకుండా కటింగ్ చేయించుకున్నాడని, అదే రోజు ఆ బార్బర్ షాపులో 12 మంది కటింగ్, షేవింగ్ చేసుకున్నారని, సదరు బార్బర్.. అందరికీ ఒకే టవల్ వాడటంతో వైరస్ ఫైలాయించిందని డాక్టర్ వర్మ తెలిపారు.

అతను బచాయించినా..
కరోనా పేషెంట్ ముఖాన్ని తుడిచిన అదే టవల్ ను మిగతా 11 మందికీ వాడటంతో ఆరుగురు వ్యక్తులకు వైరస్ సోకిందని, ప్రస్తుతం వాళ్లందరినీ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించామని, ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని డాక్టర్ వర్మ పేర్కొన్నారు. అయితే, నిరంతరం శానిటైజర్ వాడటం వల్లేమో, కటింగ్ చేసిన వ్యక్తికి మాత్రం కరోనా అంటుకోలేదని తెలిపారు. ఖర్గోన్ జిల్లాలో ఇప్పటికే 60 పాజిటివ్ కేసులు, ఆరు మరణాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బార్బర్ షాపుతోపాటు బర్గావ్ ఊరు మొత్తాన్నీ సీజ్ చేసి, టెస్టింగ్స్ నిర్వహిస్తున్నామని వివరించారు.

సీఎం కఠిన ఆదేశాలు..
ఖర్గోన్ జిల్లాలో కటింగ్ షాప్ ద్వారా వైరస్ వ్యాప్తి ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. కేంద్రం లాక్ డౌన్ కు మినహాయింపులు ఇచ్చినప్పటికీ, మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్, భోపాల్, ఉజ్జయిని, ఇండోర్, జబల్ పూర్, దార్ జిల్లాల్లో వాటిని అమలు చేయబోమని, ఆ జిల్లాల్లో దుకాణాల్ని మూసే ఉంచాలని సీఎం ఆదేశించారు. దేశంలో కరోనా ఎఫెక్టెడ్ రాష్ట్రంలో టాప్-5వ స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ లో ఇప్పటిదాకా 2వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా,

బార్బర్ షాపులపై క్లారిటీ..
లాక్డౌన్ కారణంగా నెల రోజులకుపైగా ఇళ్లలోనే ఉంటోన్న ప్రజలకు జుట్టు పెరుగుదల ఇబ్బందికరంగా మారింది. నిత్యావసరాలు, అత్యవసరాలు అడుగుతోన్నవాళ్లకంటే, బార్బర్ షాపులు, బార్లు రీఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నవాళ్ల సంఖ్యే ఎక్కువ. సరిగ్గా ఇదే సమయంలో.. లాక్ డౌన్ రిలాక్సేషన్స్ కల్పిస్తూ కేంద్ర హోం శాఖ శనివారం సవరణ ఉత్తర్వులు జారీచేసింది. మళ్లీ తెరుచుకోనున్న దుకాణాల జాబితాలో బార్బర్ షాపులు కూడా ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ బార్బర్ షాపులు, బార్లకు అనుమతి ఇవ్వలేదని కేంద్రం అధికారులు ఆదివారం స్పష్టం చేశారు. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,384కాగా, అందులో సుమారు 6వేల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 826 మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications