"మూడు అతిపెద్ద ప్రమాదాలు రాబోతున్నాయి.. భారత్ కు తీవ్ర హెచ్చరికలు "
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో మునిగిపోయాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దాంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ గణనీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ పడిపోతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ ఆర్థికవేత్త, IMF మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత్ త్రిబుల్ డేంజర్ ను ఎదుర్కుంటోందని IMF మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సంక్షోభం జూన్ వరకు కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు బ్యారెల్ కు 140 డాలర్ల వరకూ పెరిగే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ.. భారత ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఆర్థిక భారాన్ని తానే భరిస్తూ దేశీయంగా ధరలను పెంచడం లేదు. అయితే ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
అలాగే ఇంధన ధరలు పెరుగుదల కేవలం రవాణాకు మాత్రమే కాకుండా ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువుల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని IMF మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో దేశంలో నిత్యావసర ధరలు పెరుగుతాయని.. ద్రవ్యోల్బణం వేగంగా పైకి ఎగబాకే ప్రమాదం ఉందని సంకేతం ఇచ్చారు. మరోవైపు ఫిబ్రవరిలో డాలర్ తో పోల్చితే రూ. 91 ఉన్న భారత రూపాయి విలువ రూ. 97 కు పడిపోయింది. ముడిచమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి రావడం వల్ల రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపాయి విలువ కంటే ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి పైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇక అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం అధికంగా ఉన్నప్పటికీ భారత్ లో దేశీయ డిమాండ్ లు అధికంగా ఉండటం, మౌలిక వసతులపై పెట్టుబడులు, 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటం కారణంగా భారత్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఇంధన ధరల భారం సామాన్యులపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పేద కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ చేయాలని, ఇబ్బందుల్లో ఉన్న చిన్న పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించి ఆదుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications