ఒకటవ తరగతి బాలుడిని చంపిన విద్యార్థి
చెన్నై: తమిళనాడులో దారుణం జరిగింది. స్కూల్ లో సాటి విద్యార్థులలో కలిసి ఆడుకుంటున్న ఒకటో తరగతి విద్యార్థిని సాటి విద్యార్థి అతి దారుణంగా కొట్టి చంపేశాడు. టాయిలెట్ లో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
పోలీసు అధికారుల కథనం మేరకు - తమిళనాడులోని తిరువూర్ నగరంలోని ఓ పాఠశాలలో శివరామ్ (6) ఒకటవ తరగతి చదువుతున్నాడు. ఇదే స్కూల్ లో 12 ఏళ్ల విద్యార్థి చదువుతున్నాడు. బుధవారం ఉదయం తరగతులు ప్రారంభం కాకముందు మైదానంలో ఇద్దరి మద్య ఘర్షణ జరిగింది.
తరువాత చిన్నవాడైన శివరామ్ మీద ఆ విద్యార్థి ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. తరువాత గ్రౌండ్ లో నుంచి ఈడ్చుకుంటూ వెళ్లి భవనం వెనుక ఉన్న టాయిలెట్ లో శివరామ్ ను పడేశాడు. అంతటితో ఆ విద్యార్థి కోపం చల్లారలేదు.
అక్కడే ఉన్న బండరాయి మీద శివరామ్ తల వేసి దారుణంగా దాడి చేశాడు. రక్తమోడుతున్న శివరామ్ ను అక్కడే వదిలి పెట్టి అక్కడి నుంచి పరారైనాడు. శివరామ్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. 11 ఏళ్ల బాలిక ఈ ఘటనను తరగతి గదిలో నుంచి చూసి ఉపాధ్యాయుడికి సమాచారం ఇచ్చింది.
వెంటనే శివరామ్ ను తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శివరామ్ మరణించాడని వైద్యులు చెప్పారు. పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రాథమిక విచారణ జరిగింది.
శివరామ్ ను హత్య చేసిన బాలుడిని అరెస్టు చేశారు. అతనిని జువెనైల్ కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసు అధికారులు తెలిపారు. శివరామ్ మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొద్ది రోజులు పాఠశాలకు సెలవులు ప్రకటించారు.