వృద్దురాలిపై యుపిలో గ్యాంగ్ రేప్: బాలికపై వృద్ధుడి లైంగిక దాడి
లక్నో/ ఎరోడ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజిపూర్ జిల్లాలో 65 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు మంగళవారంనాడు చెప్పారు. సంఘటన జరిగిన తర్వాత తీవ్రమైన రక్తం కారడంతో ఆమె చనిపోయినట్లు అనిపిస్తోందని వారన్నారు. ఆ సంఘటన ఘాజీపూర్ జిల్లాలోని చట్టిలో జరిగింది.
మహిళ పెద్దగా కేకలు వేసింది. ఇంట్లోంచి కేకలు వినిపించడంతో అటుగా వెళ్తున్నవారు వెళ్లి చూడడంతో సోమవారం ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. వారు చూసేసరికి మహిళ రక్తం మడుగులో అర్థనగ్నంగా పడి ఉంది. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఆమె మరణించింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు సాగిస్తన్నారు. సంఘటనా స్థలం వద్ద నాలుగు మద్యం సీసాలు, గ్లాసులు, ఇతర సరుకులు కనిపించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే, తమిళనాడులోని ఎరోడ్ జిల్లా వీరప్పచత్రంలో ఓ 65 ఏళ్ల వృద్ధుడు ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు బయటకు వెళ్లడం చూసిన ఆ వృద్ధుడు బాలికను సోమవారంనాడు తన ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కాసేపటికి ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు తమ అమ్మాయి కనిపించలేదు. దాంతో తండ్రి పొరుగున ఉన్న వృద్ధుడి ఇంటికి వెళ్లాడు. తన కూతురిపై అతను లైంగిక దాడికి పాల్పడుతున్న విషయాన్ని గమనించి అతను కేకలు వేశాడు. అక్కడి నుంచి వృద్ధుడు పారిపోయాడు. కానీ ఆ తర్వాత పోలీసులు గత రాత్రి అతన్ని అరెస్టు చేశారు.