కోర్టులో దగ్గిన దొంగ.. టెస్టుల్లో కరోనా పాజిటివ్.. క్వారెంటైన్లో జడ్జి,పోలీసులు..
పంజాబ్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. లూథియానాలో చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను శుక్రవారం(ఏప్రిల్ 10)న స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి విచారణ జరుపుతుండగా ఇద్దరు దొంగలు అవిరామంగా దగ్గుతూనే ఉన్నారు. దీంతో అనుమానం వచ్చిన జడ్జి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.
న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఒక దొంగ పరారయ్యాడు. మరో దొంగకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆ దొంగను ఐసోలేషన్ వార్డుకు తరలించగా.. ఏడుగురు పోలీసులు హోం క్వారెంటైన్లోకి వెళ్లారు. అలాగే సదరు న్యాయమూర్తి కూడా హోం క్వారెంటైన్ చేసుకున్నట్టు వెల్లడించారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా క్వారెంటైన్లోకి వెళ్లినట్టు సమాచారం. మరోవైపు తప్పించుకుపోయిన మరో దొంగ కోసం వెతుకుతున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
Recommended Video
కాగా,ఇప్పటివరకు పంజాబ్లో 130 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 11 మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాష్ట్రంలో లాక్ డౌన్ను మే 1వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్కు ఒకరోజు ముందే అమరీందర్ సింగ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడగించారు. కేంద్రం కూడా లాక్ డౌన్ పొడగింపుపై సమాలోచనలు జరుపుతోంది. 2,3 రోజుల్లో దీనిపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.