అమ్మాయి నోటి నుంచి 202దంతాలు తొలగించారు
న్యూఢిల్లీ: ఓ ఏడేళ్ల అమ్మాయి నోట్లో అసాధారణంగా పెరిగిన 202 దంతాలను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తొలగించారు. ఆ బాలిక కుటుంబం గురుగావ్లో నివసిస్తోంది. కాగా, నోటిలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆ బాలిక తండ్రి ఆమెని ఎయిమ్స్కు తీసుకువచ్చారు.
ఎయిమ్స్ వైద్యుడు అజయ్రాయ్ చౌదరి ఆ అమ్మాయి నోటిని ఎక్స్ రే తీశారు. ఆమె నోట్లో అనేక పళ్లతో కూడిన గడ్డ కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఎయిమ్స్లోని దంత వైద్య నిపుణుల బృందం శస్త్ర చికిత్స చేసి 202 పళ్లను తొలగించింది.
‘కొంత మందిలో ఇలా అసాధారణంగా పెరిగిన దంతాలను చూస్తుంటాం. కానీ ఏడేళ్ల పాప నోట్లో ఇంత పెద్ద సంఖ్యలో దంతాలను చూసి ఆశ్చర్యపోయాం' అని శస్త్ర చికిత్స చేసిన వైద్యులు మీడియాకు తెలిపారు. వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించడానికి ఇంచుమించు రెండు గంటల సమయం పట్టిందని చెప్పారు.

న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో డెంటల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగం వారు ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం ద్రవాహారం, మెత్తని ఆహారం బాలికకు అందించాలని వైద్యులు సూచించారు. కొద్ది నెలల్లోనే బాలిక దృఢమైన ఆహారాన్ని కూడా తీసుకోవచ్చని చెప్పారు.
కాగా, సర్జరీకి ముందు రోజు ఆ అమ్మాయి తన పుట్టిన రోజు వేడుకలను వైద్యులు, కుటుంబసభ్యులు సమక్షంలో జరుపుకుంది. ఇది ఇలా ఉండగా మూడు నెలల క్రితం ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ 17ఏళ్ల యువకుడి నోట్లోంచి 232 దంతాలను శస్త్ర చికిత్స చేసి తొలగించారు.












Click it and Unblock the Notifications