పాక్ జెండాతో హోర్డింగ్: 7గురు యువకుల అరెస్ట్, ఒకరు హిందూ వ్యక్తి
భోపాల్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పాకిస్తాన్ దేశ జెండాతో కూడిన హోర్డింగ్ ఏర్పాటు చేసిన ఏడుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గ్వాలియర్లో రెండు రోజుల క్రితం ఏడుగురు యువకులు మిలాద్ ఉన్న నబీ శుభాకాంక్షలు తెలిపేందుకు ఓ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.
అందులో పాకిస్తాన్ దేశపు జెండాను అచ్చు వేశారు. అది గమనించిన స్థానికులు, హిందూ సంస్థలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో ఆరుగురు ముస్లీం యువకులు, ఒక హిందూ యువకుడు ఉన్నారని తెలుస్తోంది.
వారిని కోవలి పోలీసు స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు విచారణ జరిపారు. అనంతరం సోమవారం అరెస్టు చేశారు. మంగళవారం నాడు కోర్టులో ప్రవేశ పెట్టారు.
వారికి న్యాయస్థానం పద్నాలుగు రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించినట్లు గ్వాలియర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆదర్శ్ కతియార్ తెలిపారు. అరెస్టైన ఏడుగురు యువకులు ఏర్పాటు చేసిన బ్యానర్ గ్వాలియర్లోని మహరాజవాడ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నిందితుల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.