రిపబ్లిక్డే: పవర్ ఆఫ్ 'ఉమెన్'.. చరిత్రలో తొలిసారి అలా..!
జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నిర్వహించిన కవాతు అట్టహాసంగా జరిగింది. ఈ కవాతులో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని నారీశక్తిని చాటారు. కవాతులో భాగంగా దేశ సంస్కృతిని, వారసత్వాన్ని, స్వేచ్ఛ, ఏకత్వంలో భిన్నత్వం, అభివృద్ధి తదితర అంశాలను చాటారు. ఎన్ సీసీ కాడెట్లు నిర్వహించిన పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఎన్ సీసీ విభాగంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ వేడుకల్లో వికసిత్ భారత్, నారీ శక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశ చరిత్రలో తొలిసారిగా 100మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్లో పరేడ్ను నిర్వహించారు. ఈ పరేడ్ చూపరులను ఆకట్టుకుంది.
డీఆర్డీఓ అతివల కవాతు..
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కవాతుకు మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. అధునాతన రక్షణ సాంకేతికతల ద్వారా దేశ భద్రతను బలోపేతం చేయడంలో అతివలు అందించిన కీలకమైన సహకారాన్ని అందులో ప్రదర్శించారు. అసిస్టెంట్ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన 148 మంది సభ్యుల మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటి కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్లో పాల్గొన్నాయి. సుమారు 15మంది మహిళా పైలట్ల బృందం ఫ్లై-పాస్ట్లో తమ ప్రతిభను చూపారు. కవాతులో 16 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు సందడి చేశాయి. వీటిలో మహిళా సాధికారత అంశాన్ని ప్రతిబింబించేవి 26 ఉన్నాయి.

మణిపుర్లో తామర పూల కాడలలోని సున్నితమైన నారలతో చీరలు తయారు చేసే మహిళలు, పడవలు నడుపుతున్న స్త్రీలు, హస్తకళలు, చేనేత సహా వివిధ రంగాల్లో ప్రఖ్యాతి పొందిన వారికి సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. మొత్తంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ రవీందర్జీత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సాహా, కెప్టెన్ సంధ్యా మహ్లా ఈ కవాతులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications