మహారాష్ట్రలో కరోనా మారణహోమం: ఒక్కరోజులో అత్యధిక మరణాలు, 66వేలకుపైగా కొత్త కేసులు
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజురోజుకు మరింత కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండ్రోజులుగా మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో 66 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 700లకుపైగా మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మహారాష్ట్రలో 66వేలకు పైగా కరోనా కేసులు.. కరోనా మారణ హోమం
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 773 మంది కరోనా బారినపడి మరణించారు. తాజాగా, రాష్ట్రంలో 66,836 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 41,88,266 మంది రోగులు హోంక్వారంటైన్లో ఉండగా, 29,378 మంది ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సెకండ్ వేవ్లో మహారాష్ట్రలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది.
మహారాష్ట్రకు ఉపశమనం కలిగించే విషయం ఇదే..
అయితే, తాజాగా, కొత్త కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం మహారాష్ట్రకు కాస్త ఉపశమనం కలిగించే అంశంగా కనిపిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 74,045 మంది కరోనా రోగులు మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు 34,04,792 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 81.81 శాతంగా ఉంది. మరణాల రేటు 1.52 శాతంగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 6,91,851 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 16.53 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
మహా నగరాల్లోనూ కరోనా కల్లోలమే..
పుణెలో తాజాగా, 9863 కరోనా కేసులు నమోదు కాగా, 30 మంది మరణించారు. నాగ్పూర్లో 7970 కరోనా కేసులు నమోదు కాగా, ముంబైలో 7,221 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ముంబైలో కూడా కరోనా బారినపడినవారికంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా, 9541 మంది కోలుకున్నారు. శుక్రవారం ముంబైలో 72 మంది మరణించారు.
రెమిడిసివిర్ కోసం మహారాష్ట్ర అంతర్జాతీయ టెండర్..
మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత భారీగా ఏర్పడింది. కేంద్రాన్ని సాయం కోరడంతో ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రానికి పంపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఏడు ఆక్సిజన్ ట్యాంకర్లు శుక్రవారం మహారాష్ట్రకు చేరుకున్నాయి. కాగా, రెమిడిసివిర్ వ్యాక్సిన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. టెండర్ కూడా జారీ చేసింది. ఈజిప్టు, బంగ్లాదేశ్, సింగాపూర్ దేశాలు వ్యాక్సిన్ అందజేసేందుకు ఆసక్తిగా ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు.