అలర్ట్.. అలర్ట్... కశ్మీర్కు మరో 8 వేల మంది సైనికులు (వీడియో)
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు చేయడంతో కశ్మీర్ వ్యాలీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కశ్మీర్కు ప్రత్యేక హోదా ఉండబోదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో కశ్మీర్ కొండల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉండడంతో మరో 8 వేల మంది సైనికులను పంపించారు. వైమానిక దళ ప్రత్యేక హెలికాప్టర్లో సైనికులను తరలించినట్టు భద్రతా అధికారులు పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దవడంతో కశ్మీర్లో ఆందోళనలు నెలకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే వ్యాలీలో భారీగా జవాన్లను మొహరించారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామనే సంకేతాలతో .. ఇప్పటికే అమర్ నాథ్ యాత్రికులను వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విద్యాసంస్థలను మూసివేసి .. విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఈ క్రమంలో భారత వైమానిక దళానికి చెందిన సీ -17 విమానాల ద్వారా శ్రీనగర్కు భద్రతా దళాలను పంపించారు. ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, అసోం ఇతర ప్రాంతాల నుంచి సైనికులను పంపించారు. ఇప్పటికే 35 వేల మంది కశ్మీర్లో భద్రతాసిబ్బంది మొహరించిన సంగతి తెలిసిందే.
జమ్ము కశ్మీర్కు ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి కలిగి ఉంది. దానిని రద్దు చేయడంతో కశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించపడ్డాయి. ఇక నుంచి వాటికి ప్రత్యేక ప్రతిపత్తి ఉండదు. ఇప్పటివరకు కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. అంటే కశ్మీర్కు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే నిబంధనలు వర్తించవు. రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవస్థలు విడిగా ఉండేవి. ఈ క్రమంలో కశ్మీర్ను రెండు విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
జమ్ము కశ్మీర్; లడఖ్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. వెంటనే రాష్ట్రపతి కార్యాలయం గెజిట్ కూడా విడుదల చేసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో బలగాలను పంపిస్తున్నారు. ఇప్పటికే 35 వేల మంది మొహరించగా .. మరో 8 వేల మంది పంపించారు. దీంతో కశ్మీర్లో 43 వేల మంది బలగాలు తమ విధుల్లో మునిగిపోయాయి.
గత 15 రోజుల నుంచి కశ్మీర్లో పరిస్థితి మారిపోయింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పర్యటనతో ఏందో జరగబోతుందనే సంకేతాలు వచ్చాయి. ఆయన కశ్మీర్ వెళ్లొచ్చాకనే 10 వేల మంది భద్రతా సిబ్బందిని మొహరించారు. పథకం ప్రకారం విద్యార్థులను కూడా బయటకు పంపించారు. కశ్మీర్లో ఏం జరుగుతుందోననే సంకేతాలతో ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పెట్రోల్ కొనగోలు చేసి పెట్టుకున్నారు. ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా నిల్వ చేసుకున్నారు.