మంచుచరియలు విరిగిపడి 8 మంది మృతి: 430 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు
డెహ్రూడన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. చమోలీ జిల్లా నీతి లోయకు సమీపంలో శుక్రవారం భారీ మంచుచరియలు విరిగిపడి 8 మంది మరణించారు. మరో 400 మందికిపైగా కూలీలను సహాయ సిబ్బంది రక్షించారు.
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సుమ్నా ప్రాంతంలో ఈ హిమపాతం చోటు చేసుకుంది. ఘటన సమయంలో వందల మంది సిబ్బంది సుమ్నా-రిమ్ఖిమ్ రహదారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో భారీ నష్టం జరిగింది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆర్మీ, సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. దట్టంగా మంచు కురవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. అయితే, చివరకు రెస్క్యూ సిబ్బంది దాదాపు 430 మంది కూలీలను రక్షించారు.
ఇప్పటి వరకు 8 మృతదేహాలను గుర్తించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ నిర్వహించారు. దట్టంగా మంచు కురవడంతో చాలా చోట్ల రహదారులు బ్లాక్ అయిపోయాయని, కొన్నిచోట్ల దెబ్బతిన్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలోని గ్రామాలు, ప్రజలకు, పశువులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
#WATCH | Uttarakhand: CM Tirath Singh Rawat conducts an aerial survey of Sumna area of Joshimath Sector in Chamoli district, where an avalanche occurred yesterday during heavy snowfall. pic.twitter.com/Iq8bz1hFYC
— ANI (@ANI) April 24, 2021
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని విధాలా సాయం అందిస్తానని తమకు హామీ ఇచ్చినట్లు సీఎం తీరథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చమోలీలోనే భారీ మంచుచరియలు విరిగిపడిన ఘటనతో నదులు ఉప్పొంగి భారీ విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి మృతదేహాలు కూడా ఇప్పటివరకు దొరకలేదు.












Click it and Unblock the Notifications