కరోనా : ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలో మరో 8 మంది మృతి... చేతులు జోడించి కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి...
ఢిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత పేషెంట్ల ప్రాణాలను బలితీసుకుంటోంది. తాజాగా బాత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 8 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. ఇందులో ఒక వైద్యుడు కూడా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని బాత్రా ఆస్పత్రి యాజమాన్యం శనివారం(మే 1) ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఆస్పత్రిలో దాదాపు గంటన్నర సేపు ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో 8 మంది పేషెంట్లు చనిపోయారని కోర్టుకు తెలిపింది.
ఆస్పత్రి యాజమాన్యం ఏమంటోంది..
'ఆస్పత్రికి సకాలంలో ఆక్సిజన్ అందలేదు. మధ్యాహ్నం 12గంటలకు ఆక్సిజన్ అయిపోతే 1.35గంటల గానీ ఆస్పత్రికి ఆక్సిజన్ చేరలేదు. దీంతో ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స పొందుతున్న ఒక వైద్యుడు సహా 8 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్ మరో 10 నిమిషాల్లో అయిపోతుందని ప్రభుత్వానికి ఎస్ఓఎస్ మెసేజ్ ద్వారా సమాచారం చేరవేశాం. ఆ సమయంలో ఆస్పత్రిలో 326 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లు చెప్పాం...' అని తెలిపారు.
సకాలంలోనే స్పందించామన్న మంత్రి...
మరోవైపు ఢిల్లీ మంత్రి రాఘవ్ చద్దా మాట్లాడుతూ...'బాత్రా ఆస్పత్రి నుంచి ఎస్ఓఎస్ సందేశం రాగానే.. ఐదు నిమిషాల వ్యవధిలోనే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను అక్కడికి పంపించాం.' అని చెప్పారు. బాత్రా ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఆక్సిజన్ వచ్చేసరికి గంటన్నర సమయం పట్టిందని... అప్పటికే 8 మంది చనిపోయారని చెబుతుండటం గమనార్హం. ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీ ఆస్పత్రుల్లో చేరిన పేషెంట్ల వివరాలను 4 రోజుల్లోగా తమకు సమర్పించాలని ఆస్పత్రుల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది.
Recommended Video
కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి...
బాత్రా ఆస్పత్రిలో 8 మంది కరోనా పేషెంట్ల మృతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇప్పటికైనా ఢిల్లీకి తగినంత ఆక్సిజన్ను సరఫరా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు చేతులు జోడించి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలించినప్పటికీ... ప్రభుత్వం తరుపున లేఖలు రాసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదన్నారు.
ఢిల్లీకి సగటున రోజుకు 975 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా... ప్రస్తుతం 490 టన్నుల ఆక్సిజన్ను మాత్రమే కేటాయించారని చెప్పారు. కాగా,కొద్దిరోజుల క్రితమే ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది కరోనా పేషెంట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 20 మంది పేషెంట్లు మృతి చెందారు. ఇలా పేషెంట్లు పిట్టల్లా రాలిపోతున్నా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని హైకోర్టు ఇదివరకే కేంద్రాన్ని నిలదీసింది. అయినప్పటికీ కేంద్రం నుంచి తగిన స్థాయిలో ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా కావడం లేదు.