కరోనా విలయం: ప్రమాదంలో ఇండియా.. 80% అసింప్టమాటిక్ కేసులే.. సీఎంల ఆందోళన, పరిష్కారమిదే..
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరకుండానే ఇండియాలో కేసుల సంఖ్య 27వేలకు చేరువైంది. ఆదివారం నాటికి మరణాల సంఖ్య 800 దాటింది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసుల సంఖ్య 8వేలకు దగ్గరగా ఉంది. ఇప్పటికే అక్కడ 323 మంది చనిపోయారు. కాగా, మహారాష్ట్రలో నమోదైన కొవిడ్-19 కేసుల్లో 80 శాతం అసింప్టమాటిక్ కేసులేనని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఆయనీ విషయాన్ని అధికారికంగా వెల్లడించడానికి రెండ్రోజుల ముందే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఐసీఎంఆర్).. దేశవ్యాప్తంగానూ అసింప్టమాటిక్ కేసులు 80 శాతంగా ఉన్నాయని చెప్పింది. ఈ తరహా కేసుల్ని ఎలా డీల్ చేయాలనేదానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Recommended Video

అసింప్టమాటిక్ అంటే..
నిజానికి మన దేశంలో తొలి రెండు నెలలు వ్యాధి లక్షణాలు బయటపడ్డవాళ్లే ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందారు, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తో పరీక్షలకు అనుమతించిన తర్వాత బయటపడుతోన్న కేసులు మరింత ఆందోళనకరంగా మారాయి. రోగ లక్షణాలు(సింప్టమ్స్) బయట పడకుండా వ్యాధికి గురికావడాన్నే వైద్యపరిభాషలో అసింప్టమాటిక్ అంటారు. కరోనా సాధారణ లక్షణాలైన దగ్గు, జ్వరం, జలుబు లేకపోయినా, ర్యాపిడ్ కిట్స్ ద్వారా టెస్టులు చేసినప్పుడు కొవిడ్-19 పేషెంట్లుగా తేలుతున్నవాళ్ల సంఖ్య నూటికి 80 శాతం ఉన్నది. ఈ తరహా కేసులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని రిపోర్టులు వస్తున్నప్పటికీ, మొదటిసారి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్.. తమ రాష్ట్రంలో వెలుగుచూసిన మొత్తంలో 80 శాతం అసింప్టమాటిక్ కేసులేనని అధికారికంగా ప్రకటించారు.

ఎంత ప్రమాదమంటే..
మహారాష్ట్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇప్పటిదాకా కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరినవాళ్లకంటే, అంతకు నాలుగు రెట్ల మంది వైరస్ ను మోసుకుంటూ యథేచ్ఛగా బయట తిరిగారు. టెస్టులు చేసినతర్వాతగానీ వాళ్లకు వైరస్ సోకిందన్న సంగతి నిర్ధారణ కాలేదు. తమకు తెలియకుండానే ఈ అసింప్టమాటిక్ వ్యక్తులు బయట తిరుగుతూ ఇతరులకూ వైరస్ అంటిస్తున్నారు. ఈ ప్రక్రియ కొన్ని రోజులుగా కొనసాగుతున్నందున ఇప్పటికే ప్రమాదకర పరిస్థితి దాపురించినట్లు భావించాలని ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ నిర్మల్కుమార్ గంగూలీ వ్యాఖ్యానించారు.

అదొక్కటే పరిష్కారం..
అసింప్టమాటిక్ కేసుల ఉధృతి పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని మోదీకి కీలక సూచన చేశారు. ర్యాపిడ్ టెస్టులను భారీగా చేపట్టడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ఆయన సూచించారు. ప్రస్తుతం దేశంలో రోజుకు 40వేల టెస్టులు మాత్రమే నిర్వహిస్తున్నారని, ఆ సంఖ్యను 1లక్షకు పెంచడం ద్వారా ‘బాటిల్ నెక్' క్లియర్ అవుతుందని, ఈ పనిని వెంటనే ప్రారంభించడం మంచిదని రాహుల్ అన్నారు. ఓవైపు టెస్టులు పెంచుకుంటూ పోతూనే, పేద వలస కూలీలకు ప్రభుత్వం అండగా నిలవాలని, ప్రతి వ్యక్తికి రేషన్ తోపాటు ఖాతాలో రూ.7500 జమచేయాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు.

30 తర్వాత కీలక నిర్ణయం..
దేశ ఆర్థిక రాజధాని ముంబై కొలువైఉన్న మహారాష్ట్రలో వ్యాపారాల రీఓపెనింగ్ పై ఈనెల 30 తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ‘‘కరోనా వైరస్ ఇప్పటికిప్పుడు మాయమైపోతుందని చెప్పలేం. దానికి ఆధారాలు కూడా లేవిప్పుడు. హై రిస్క్ ను నివారించడానికే లాక్ డౌన్ అమలవుతోంది. అలాగని దీన్ని కూడా ఎల్లకాలం కొనసాగించలేం. అన్నీ రివ్యూ చేసిన తర్వాతే ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటాం. వలస కూలీల విషయంలో మేం కూడా ఉదారంగానే ఉంటున్నాం. వాళ్లను స్వస్థలాలకు పంపేందుకు రైళ్లు నడవట్లేదు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నాం. అప్పటిదకా ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలి''అని ఉద్ధవ్ చెప్పారు.












Click it and Unblock the Notifications