ఓటర్లే టార్గెట్గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలు
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్న నాయకులు... పనిలో పనిగా ప్రచారం కోసం టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు వాట్సప్లలో ఓటర్లకు రాజకీయ సందేశాలు పంపుతున్నారు.
వాట్సప్లో 87 వేల గ్రూపులు
గత ఎన్నికల్లో ఫేస్బుక్ను వారధిగా చేసుకున్న పొలిటికల్ లీడర్లు ఇపుడు ఆన్ లైన్ ప్రచారం కోసం వాట్సప్ను ఆశ్రయించారు. దీంతో సోషల్ మీడియా ప్రచారంలో ఇప్పటి వరకు ముందున్న ఫేస్బుక్ ను వాట్సప్ అధిగమించింది. సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపు 87 వేలకు పైగా పొలిటికల్ వాట్సప్ గ్రూపులు యాక్టివ్ గా పనిచేస్తున్నాయంటే దాని హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారీగా పెరిగిన వాట్సప్ యూజర్లు
భారత్ లో దాదాపు 43 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారన్నది ఒక అంచనా. ఈ నేపథ్యంలో దేశంలో 30 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉండి ఉండే అవకాశం లేకపోలేదు. యూజర్లకు సంబంధించి వాట్సప్ అధికారిక గణాంకాలు వెల్లడించనందున ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్నారుల నుంచి ముసలివారి వరకు వాట్సప్ను వినియోగిస్తున్నందున తమ సందేశాలు చేరవేసేందుకు రాజకీయపార్టీలు ఈ గ్రూపులను ఆశ్రయిస్తున్నాయి.
వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజకీయ ప్రస్తావనా..? జర బద్రం..! సోషల్ మీడియా పై ఈసీ డేగ కన్ను..!!
జియో రాకతో పెరిగిన వినియోగం
జియో రంగ ప్రవేశంతో డేటా చార్జీలు చాలా వరకు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వాట్సప్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. వాట్సప్ లో క్రియేట్ చేసే ఒక్కో గ్రూపులో 256 మంది వరకు సభ్యుల్ని చేర్చవచ్చు. ఈ లెక్కన చూస్తే 87 వేల గ్రూపులు దాదాపు 2.2 కోట్ల ప్రజలకు తమ సందేశాలను నేరుగా పంపుతున్నాయి. ఈ గ్రూపుల నుంచి అందే సందేశాలను యూజర్లు మరో ఐదుగురికి ఫార్వర్డ్ చేసినా ఒక సందేశం దాదాపు 10 కోట్ల మందికి చేరుతుంది. దీన్ని బట్టి వాట్సప్ గ్రూపులు ఏ రేంజ్ లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.