గుజరాత్ కేబుల్ బ్రిడ్జి: 9 మంది నిందితుల అరెస్ట్, నిర్లక్ష్యానికి పరాకాష్ట, 141కి చేరిన మృతులు
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రం మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో బాధ్యులైన తొమ్మిది మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ బ్రిడ్జికి మరమ్మతు చేసిన కంపెనీ ఒరేవాకు చెందిన అధికారులు కూడా ఇందులు ఉన్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు రిపేర్ కాంట్రాక్టర్లు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు టికెట్ విక్రయదారులు ఉన్నారు.
కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 9 మంది అరెస్ట్
కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. గోడ గడియారాలు తయారు చేసే ఒరేవా కంపెనీ.. ఈ బ్రిడ్జి మరమ్మతుల కాంట్రాక్టును దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్వాహకుల నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. కేబుల్ బ్రిడ్జి మరమ్మతులో ఈ కంపెనీ.. నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
కేబుల్ బ్రిడ్జి పైకి 125 మందికి బదులు 500 మందికిపైగా..
అంతేగాక, మరమ్మతుల తర్వాత కేబుల్ బ్రిడ్జి పూర్తిస్థాయిలో సందర్శకుల వీక్షణకు అనుమతి లభించకపోయినప్పటికీ.. నిర్వాహకులు సందర్శకులను బ్రిడ్జిపైకి అనుమతించారు. కేవలం 125 మంది సందర్శకులను అనుమతించాల్సి ఉండగా.. ఏకంగా 500 మందికిపైగా ప్రజలను అనుమతించడం కూడా ప్రమాదానికి కారణమైంది.
2037 వరకు కేబుల్ బ్రిడ్జి కాంట్రాక్ట్..
అంతేగాక, ప్రమాదం జరిగిన రోజున సందర్శకుల నుంచి రూ. 12-17 రూపాయలు వసూలు చేశారు నిర్వాహకులు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కేబుల్ బ్రిడ్జి కాంట్రాక్టును దక్కించుకున్న ఈ కంపెనీ.. 2037 వరకు టికెట్లను విక్రయించనుంది. టికెట్ల ధరలను కూడా ప్రతిఏడాది టికెట్ ధరలను పెంచుకునేందుకు ఈ కంపెనీకి అనుమతి ఉన్నట్లు సమాచారం.
కేబుల్ బ్రిడ్జి ఘటనలో 141కి చేరిన మృతుల సంఖ్య
కేబుల్ బ్రిడ్జి నదిలో కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు 141 మంది మరణించారు. ఇందులో బీజేపీ ఎంపీకి చెందిన 12 మంది కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. కాగా, నదిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో వంద మంది ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు నదిలో తీవ్రంగా గాలిస్తున్నాయి.
కేబుల్ బ్రిడ్జి ఘటనపై మోడీ భావోద్వేగం.. రేపు ఘటనా స్థలికి
ప్రధాని నరేంద్ర మోడీ.. కేబుల్ బ్రిడ్జి విషాద ఘటనపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. ఓ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురై కళ్లకు నీళ్లు తెచ్చుకున్నారు. క్షతగాత్రులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా, కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటన స్థలికి మంగళవారం ప్రధాని మోడీ వెళ్లనున్నారు.