2రోజుల క్రితం డ్రైన్లో పడిన బాలిక శవం లభ్యం(ఫొటో)
బెంగళూరు: డ్రైన్లో పడి ఓ తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం(సోమవారం సాయంత్రం) డ్రైనేజీలో పడిన ఆ బాలిక బుధవారం విగత జీవిగా లభ్యమైంది. దీంతో బాలిక కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు డ్రైన్లో జారిపడి కనిపించకుండా పోయిన గీతాలక్ష్మి(9) మృతదేహం రెండు రోజుల ముమ్మర గాలింపు అనంతరం లభ్యమైంది. భారీ వర్షం కారణంగా ఆమె మృతదేహం డ్రైన్లో కొట్టుకుపోయింది. జారిపడిన ప్రాంతానికి 3కిలోమీటర్ల దూరంలో బాలిక శవం దొరికింది.

తమిళనాడుకు చెందిన గీత తన కుటుంబసభ్యులతో కలిసి దసరా సెలవుల సందర్భంగా బెంగళూరు సందర్శనకు వచ్చినట్లు తెలిసింది. బాలిక తన బంధువుతో కలిసి రోడ్డుపై నడుస్తుండగా డ్రైన్ మూత తీసి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. భారీ వర్షం కారణంగా నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో బాలిక ప్రవాహంలో కొట్టుకుపోయింది.
కాగా, బాలిక పడిన డ్రైన్ 10 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పు ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు, విపత్తు నియంత్రణ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండ్రోజుల నుంచి గాలించగా బుధవారం బాలిక మృతదేహం లభ్యమైంది.












Click it and Unblock the Notifications