మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో మరణాలు: కర్ణాటకలో అరలక్ష కొత్త కేసులు, బెంళూరులోనే సగం
ముంబై: మహారాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ.. మరణాలు మాత్రం రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం 57వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, 900లకుపైగా మరణాలు సంభవించాయి. ఈ స్థాయిలు మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మహారాష్ట్రలో 57,640 కొత్త కేసులు, 920 మరణాలు
మహారాష్ట్రలో బుధవారం కొత్తగా 57,640 కరోనా కేసులు నమోదు కాగా, 920 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ముంబైలో 3879 కరోనా కేసులు నమోదు కాగా, 77 మంది మరణించారు. పుణెలో 9084 కరోనా కేసులు నమోదు కాగా, 93 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 6.41 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
ముంబైలో మాస్కు జరిమానాలే రూ. 50 కోట్లు దాటాయి
మరోవైపు ముంబై మహానగరంలో మాస్కులు ధరించని వారి నుంచి సేకరించిన జరిమానాలు రూ. 50 కోట్లు దాటడం గమనార్హం. ముంబై నగరంలో ఏడాది కాలంలో 26.87 లక్షల మంది మాస్కు నిబంధనల్ని ఉల్లంఘించగా.. వారి నుంచి జరిమానా రూపంలో రూ. 54 కోట్లు వసూలైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. మంగళవారం ఒక్కరోజే 4314 మంది మాస్కులు లేకుండా పట్టుబడటం గమనార్హం.
కర్ణాటకలో కరోనా కల్లోలం.. కొత్తగా 50వేలకుపైగా కేసులు
మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కరోజులోనే కర్ణాటకలో 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, అందులో దాదాపు సగం కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. కర్ణాటక ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,55,224 కరోనా నమూనాలను పరీక్షించగా.. 50,112 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Recommended Video
కర్ణాటకలో 5 లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులు
ఒక్కరోజు వ్యవధిలో కర్ణాటకలో కరోనాతో 346 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 16,884కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,87,288 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 32.88 శాతం ఉండగా, మరణాల రేటు 0.69 శాతంగా ఉంది. కాగా, కర్ణాటకలో ఏప్రిల్ 27 నుంచి మే 12 వరకు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలనే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.