ఫాంహౌజ్ లో 15 రోజులు గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో దారుణం జరిగింది. ఓ బాలికను ఫాం హౌజ్ లో నిర్బంధించి 15 రోజుల పాటు అత్యాచారం చేశారు. చివరికి బాలిక తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో తుపాకితో కాల్చి నీళ్లు లేని బావిలో విసిరివేశారు.
బాలిక ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నదని పోలీసులు తెలిపారు. గత నెల 22వ తేదిన ఢిల్లీకి చెందిన ముగ్గురు యువకులు 16 సంవత్సరాల బాలికను కారులో గ్రేటర్ నోయిడా సమీపంలోని సాలేంపూర్ గుర్జార్ గ్రామంలోని ఓ ఫాంహౌజ్ కు తీసుకు వెళ్లారు.
అప్పటి నుంచి బాలిక మీద ముగ్గురూ సామూహిక అత్యాచారం చేస్తున్నారు. బాలికను బయటకు రాకుండా నిర్బంధించారు. గత ఆదివారం రాత్రి బాలిక తప్పించుకుంది. విషయం బయటపడుతుందని భయపడిన నిందితులు బాలికను తుపాకితో కాల్చేశారు.
తరువాత బాలిక చనిపోయిందనుకుని నీళ్లు లేని బావిలో పడేశారు. సోమవారం బాలిక కేకలు వేస్తుండటంతో స్థానిక గ్రామస్తులు ఆమెను 30 అడుగుల బాలిలో నుంచి బయటకు తీశారు. బాలికను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఛాతీ, పొత్తికడుపులో బుల్లెట్లు దూసుకు వెళ్లినా బాలిక ఒక్క రోజు బావిలో మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడిందని పోలీసులు చెప్పారు. బాలిక సృహలో ఉందని, కృష్ణ అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తన మీద గ్యాంగ్ రేప్ చేశారని బాలిక చెప్పిందని పోలీసులు అన్నారు.
కృష్ణ, అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురికి 20 సంవత్సరాల వయస్సు ఉంటుందని, బాలిక కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.