ఎన్నికల ప్రచార వాహనం ఢీ: బాలిక మృతి
పాట్నా: ఎన్నికల ప్రచార వాహనం ఢీకొని చిన్నారి మరణించిన సంఘటన బీహార్ లో జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డ్రైవర్ మాత్రం తప్పించుకుని పరారైనాడని పోలీసులు అన్నారు.
బీహార్ లో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్నది. మంగళవారం వైశాలి జిల్లాలోని రాజపాకర్ లో రెండు సంవత్సరాల బాలిక తన తాత ఇంటి ముందు ఆడుకుంటున్నది. అదే సమయంలో రాజపాకర్ శాసన సభ నియోజక వర్గం ఆర్జేడీ అభ్యర్థి శివ చంద్రరామ్ కు చెందిన వాహనం అటు వైపు దూసుకు వెళ్లింది.
ప్రచార వాహనం డీకొనడంతో బాలిక సంఘటనా స్థలంలో మరణించింది. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రమాదానికి కారణం అయిన వాహనం లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రచార సామాగ్రి తీసుకు వెళుతున్నారని పోలీసులు చెప్పారు.
పాప మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, డ్రైవర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాజపాకర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ అరవింద్ కుమార్ చెప్పారు. ప్రమాదం జరిగిందని తెలిసినా అర్జేడీ అభ్యర్థి శివ చంద్రరామ్ పాప ఇంటికి వెళ్లి క్షమాపణ కూడా చెప్పకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.