కారులో స్త్రీపై గ్యాంగ్ రేప్ చేసి వీధిలో పడేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మరో నిర్భయ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఓ వివాహితను కదులుతున్న వాహనంలో నలుగురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేసి తరువాత రోడ్డు పక్కన విసిరివేశారు.
నోయిడాకు చెందిన 35 సంవత్సరాల వివాహిత ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన మహిళ గురువారం తన భర్ద దగ్గరకు వెళ్లేందుకు బస్ స్టాప్ దగ్గర వేచివుంది.
అదే సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన నలుగురు నిందితులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. ఆమె వాహనంలో కుర్చున్న తరువాత బలవంతంగా మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు.
ఆమె మత్తులోకి జారుకున్న తరువాత సామూహిక అత్యాచారం చేశారు. తరువాత ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశంలో రోడ్డు పక్కనపడేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు సమీర్, వీరుగా గుర్తించారు. మిగిలిన ఇద్దరినీ గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.