బాలిక కిడ్నాప్: రేప్ చేసి చంపేశారు
లక్నో: బాలికను కిడ్నాప్ చేసిన ఓ దుండగుడు అతి దారుణంగా చంపేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. స్నేహితులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అతి దారుణంగా హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఈటావా భరథనా ప్రాంతంలో 9 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. గురువారం సాయంత్రం బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్నది. ఆ సందర్బంలో గుర్తుతెలియని వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లాడు. తరువాత బాలిక మీద అత్యాచారం చేశాడు.
బాలిక విషయం బయటపెడుతుందని భయపడిన నిందితుడు దారుణంగా హత్య చేసి శవాన్ని తీసుకు వెళ్లి రైల్వే గౌడన్ దగ్గర ఉన్న నిర్జనప్రదేశంలోని ముళ్ల పొదలలో విసిరివేసి అక్కడి నుండి పరారైనాడు. బాలిక కనపడక పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు పాప కోసం గాలించారు. శుక్రవారం ఉదయం ముళ్ల పొదలలో బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్నిఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.