ఏపీలో ఆ ఇద్దరి కోసం బెంగళూరు పోలీసుల జల్లెడ: ఫోన్ స్విచాఫ్, ల్యాప్టాప్ గాయబ్
బెంగళూరు: బెంగళూరులో నమోదైన ఓ పోలీస్ కేసు.. ఏపీలో కలకలం రేపుతోంది. ఓ కేసు విషయంలో బెంగళూరు పోలీసులు ఇద్దరు నిందితుల కోసం ఏపీలో గాలింపు చర్యలు చేపట్టారు. వారి కోసం జల్లెడ పట్టారు. దీనికోసం ఏపీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా.. సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు పేర్కొన్నారు. ల్యాప్టాప్లను తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఆ ఇద్దరు సాఫ్ట్వేర్ డెవలపర్లు. కిరణ్ కుమార్, ప్రియాంక బిల్లూరిగా గుర్తించారు. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్-2 ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న సీమెన్స్ హెల్త్కేర్ కంపెనీ మేనేజ్మెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఛీటింగ్ కేసు పెట్టారు.
ఈ హెల్త్కేర్ సంస్థలో ఇటీవలే వారిద్దరూ కొత్తగా సాఫ్ట్వేర్ డెవలపర్లుగా జాయిన్ అయ్యారు. రిక్రూట్మెంట్ సమయంలో అవకతవకలకు పాల్పడ్డారు. తమకు ఇంటర్వ్యూ నిర్వహించిన ఉన్నత ఉద్యోగికి లంచాన్ని ఎరగా వేశారు. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలను ముందే తెలుసుకోగలిగారు. దీనికి అనుగుణంగా కిరణ్ కుమార్, ప్రియాంక సన్నద్ధం అయ్యారు. సీమెన్స్ హెల్త్కేర్లో ఉద్యోగంలో చేరారు. అదే సంస్థలో పని చేసే మరో ఉద్యోగి సహాయంతో ఆన్లైన్ ఇంటర్వ్యూలను క్లియర్ చేయగలిగారు.
జూన్ 18వ తేదీన వారు ఉద్యోగంలో చేరారు. ఆ తరువాతే అసలు విషయం బయటపడింది. ప్రాక్టికల్గా వారి పనితీరు ఏ మాత్రం అంచనాలకు అనుగుణంగా లేకపోవడాన్ని టీమ్ హెడ్ గమనించారు. ఇంటర్వ్యూలో వారు ఇచ్చిన సమాధానాలు, ప్రాక్టికల్గా పనితీరును బేరీజు వేసుకుంటే ఎంతో వ్యత్యాసం కనిపించింది. దీనితో కిరణ్ కుమార్, ప్రియాంకపై నిఘా ఉంచారు. ఇంటర్వ్యూ నిర్వహించిన ఉద్యోగిని ప్రశ్నించగా.. లంచం తీసుకున్నట్లు అంగీకరించాడు.
దీనితో కిరణ్ కుమార్, ప్రియాంకతో పాటు అతనిపైనా కేసు నమోదు చేశారు. హైదరాబాద్కు చెందిన హైరింగ్ కన్సల్టెంట్ ఏజెన్సీ అక్టేవియస్ జేఆర్ ఏజెన్సీలో పని చేస్తోన్న నసీరుద్దీన్ అనే ఉద్యోగి ఇంటర్వ్యూ నిర్వహించినట్లు తేలింది. కిరణ్ కుమార్, ప్రియాంక ఇంటర్వ్యూకు ముందే నసీరుద్దీన్కు డబ్బు చెల్లించారని, ఉద్యోగం లభించిన వెంటనే మూడు లక్షల రూపాయలను చెల్లించడానికి కిరణ్ ఒప్పుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కిరణ్, ప్రియాంక కిందటి నెల 18వ తేదీన ఉద్యోగానికి రాజీనామా చేశారు. జాబ్లో జాయిన్ అయిన సమయంలో కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ల్యాప్టాప్లను తిరిగి ఇవ్వకలేదు. వారిద్దరి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీనితో సీమెన్స్ హెల్త్కేర్ ప్రతినిధి అభిలాష్ బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ ఏపీలో ఉన్నట్లు అనుమానిస్తోన్నారు. నిందితుల కోసం గాలిస్తోన్నారు.