ఘాట్ రోడ్లో పల్టీ కొట్టిన అయ్యప్ప స్వాముల బస్సు
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు.
మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు ఈ నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. ఆలయ ప్రధాన అర్చకుడు పీఎన్ మహేష్ నంబూద్రి ఆలయం గర్భగుడి తలుపులను తెరిచారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తరలి వెళ్తోన్నారు.

అదే సమయంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. కొద్ది రోజుల కిందటే అయ్యప్ప స్వాముల కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో అయ్యప్ప స్వామి భక్తులెవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు తాజాగా మరో ప్రైవేట్ మినీ బస్సు నంబర్ కేఏ 13 డీ 7099 ప్రమాదానికి గురైంది. 50 మంది కర్ణాటకకు చెందిన భక్తులతో కూడిన బస్సు ఇది. ఈ తెల్లవారు జామున 6 గంటల సమయంలో వాయనాడ్ జిల్లాలోని తిరునెల్లి వద్ద బోల్తా పడింది. అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరుగుముఖం పట్టిన ఈ బస్సు మార్గమధ్యలో తిరునెల్లి-థెట్టు మధ్య అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని మనంథవాడి మెడికల్ కాలేజీకి తరలించారు. అదే మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న ఇతర అయ్యప్ప స్వామి భక్తులు, స్థానికులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
శబరిమలకు భక్తులు పోటెత్తిన నేపథ్యంలో ఈ ప్రైవేట్ ఆపరేటర్లు ఎక్కువ ట్రిప్పులను నడిపించి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారని, అందుకే థామరస్సేరి వంటి ప్రమాదకర ఘాట్ సెక్షన్లల్లోనూ పరిమితికి మించిన వేగంతో బస్సులనను నడిపిస్తోన్నారనే విమర్శలు వినిపిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications