చాందీకి షాక్: ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని గురువారం త్రిశూర్ లోని స్థానిక విజెలెన్స్ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
సోలార్ స్కాంలో ఊమెన్ చాందీ వరుసగా ఆరోపణలు ఎదుర్కోంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోలార్ కుంబకోణంలో నేరుగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మీద ఆరోపణలు రావడంతో వెంటనే ఆయన పదవి నుంచి దిగిపోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదే సమయంలో సోలార్ స్కాం కేసు దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ ప్రత్యేక కోర్టు ఊమెన్ చాందీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడం, అదే రోజు తిరువనంతపురంలో వామపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తంగా మారింది.
వామపక్ష కార్యకర్తల మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఊమెన్ చాందీకి సోలార్ స్కాంలోని ప్రధాన నిందితులు సరితా నాయర్, బిజు రాధకృష్ణన్ కు నేరుగా సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
ఇదే సమయంలో తాను ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అనుచరులకు రూ. 2 కోట్లు లంచం ఇచ్చామని సరిత ఆరోపించారు. సరిత తదితరులు చౌక ధరలకు సౌర విద్యుత్ సరఫరా చేస్తామని పారిశ్రామిక వేత్తలను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
తమ రాజకీయ ప్రాబల్యం ఉపయోగించుకుని బడాబడా కాంట్రాక్టులు సొంతం చేసుకున్నారని సరితా నాయర్, బిజు రాధకృష్ణన్ తదితరులు ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఇదే సమయంలో సరిత సీఎంకు లంచం ఇచ్చామని చెప్పడంతో కేరళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.