దళిత కుటుంబం హత్య: ముక్కలుగా చేసి చెరువులో..
ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ దళిత కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను కొందరు దుండుగులు అతిదారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి గ్రామ శివారులోని ఓ చెరువులో పడేశారు. అహ్మద్నగర్ జిల్లాలోని పాథడి తాలూకాలోని జవఖడే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జవఖడే గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ క్షేత్రం వద్ద సంజయ్ జగన్నాథ్ జాదవ్(42) తన భార్య జయశ్రీ సంజయ్ జాదవ్(38), కుమారుడు సునీల్ సంజయ్ జాదవ్(19)లతో కలిసి నివాసముంటున్నాడు.
తనకున్న పొలంలో సాగు చేస్తూ సంజయ్ జగన్నాథ్ జాదవ్ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ముంబైలోని ఓ పాలడెయిరీలో ఉద్యోగం చేస్తున్న సునీల్ సంజయ్ జాదవ్ వారం రోజుల కిందటే సొంత గ్రామానికి వచ్చాడు. మంగళవారం ఉదయం జగన్నాథ జాదవ్ ఇంటి తలుపులు తెరివుండటం గమనించిన వ్యవసాయ కూలీలు, విషయాన్ని బంధువులకు చెప్పారు.
దీంతో అందరూ అక్కడికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఎవరూ లేకపోగా రక్తపు మరకలు కనిపించాయి. ఆందోళనకు గురైన బంధువులు, స్థానికులు వారి కోసం గాలింపు చేపట్టారు. అన్ని ఆస్పత్రులలో వెతికినా వారి ఆచూకీ లభించలేదు.
ఆ తర్వాత గ్రామం పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గ్రామానికి అరకిలోమీటరు దూరంలో ఉన్న చెరువులో వారి శరీరభాగాలు తేలుతూ కనిపించాయి. ఎవరో వారిపై దాడి చేసి ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పడేసినట్లుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు.