మతం తెలుసుకోవడానికి ఒంటిపై దుస్తులు విప్పించారు.. దారుణంగా కొట్టారు!!
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఓ దళితుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఒంటిపై దుస్తులు విప్పించారు. విషాదకర విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా- బాధిత దళితుడిని లాకప్లో బంధించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.
మధ్యప్రదేశ్లోని ఖర్గొనె జిల్లాలో గల నిమ్రానీ పారిశ్రామికవాడలో చోటు చేసుకుంది. దొంగతనం చేయడానికి వచ్చాడనే అనుమానంతో ఆ దళిత యువకుడిపై ఒక సామాజిక వర్గానికి చెందిన స్థానికులు దాడి చేశారు. చోరీ చేశాడని ఆరోపిస్తూ తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో నిందతుల్లోని ఒకరు ఈ ఉదంతం మొత్తాన్నీ తన సెల్ ఫోన్లో బంధించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఆ యువకుడిని పట్టుకుని ఏ మతం అని ప్రశ్నించడం ఈ వీడియోలో రికార్డయింది. మతం తెలుసుకోవడానికి అతని దుస్తులు విప్పండి అంటూ మరొకడు ఆదేశించాడు. బలవంతంగా దుస్తులు విప్పించారు. అనంతరం- వాడు హిందువు అంటూ గట్టిగా అరవడం ఈ వీడియోలో వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది పోలీసుల దృష్టికి చేరినప్పటికీ.. బాధిత దళిత యువకుడిపై కేసు పెట్టారు. ఖల్టంక పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. దీనిపై జిల్లా ఎస్పీ ధరంవీర్ సింగ్ స్పందించాడు. ఖల్టంకా పోలీస్ అవుట్పోస్ట్ ఇన్ఛార్జ్ రాజేంద్ర సింగ్ బఘెల్పై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా రాజేంద్ర సింగ్ బఘేల్.. బాధితుడిని జైలుపాలు చేశారంటూ తనకు ఫిర్యాదులు అందాయని అన్నారు. బఘేల్తో పాటు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.