యూపీ ఎన్నికలు: అలహాబాద్ పైనే అందరి ఫోకస్

రాజకీయ దిగ్గజాల కేంద్రంగా పేరొందిన అలహాబాద్ తోపాటు రాయబరేలీ పరిధిలో పోలింగ్ జరుగనుండటంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోదశ పోలింగ్ జరిగే సెగ్మెంట్లలో ప్రచారానికి తెర పడింది. బుందేల్‌ఖండ్ సహా 12 జిల్లాల పరిధిలోని 53 అసెంబ్లీ సెగ్మెంట్లకు గురువారం పోలింగ్ జరుగనున్నది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీతోపాటు 11 జిల్లాల్లోని 53 స్థానాల్లో 680 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాజకీయ దిగ్గజాల కేంద్రంగా పేరొందిన అలహాబాద్ తోపాటు రాయబరేలీ పరిధిలో పోలింగ్ జరుగనుండటంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఎస్పీ - కాంగ్రెస్ కూటమి నేతలు అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ పోటాపోటీగా అలహాబాద్ లో వేర్వేరు మార్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. రాహుల్, అఖిలేశ్ జోడీ బొల్సాన్ ప్రాంతంలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాల వేయడంతో మొదలైన రోడ్ షో పొడవునా రెండు పార్టీల కార్యకర్తల నినాదాలు, కేరింతల మధ్య జోరుగా సాగింది.

అలహాబాద్ సిటీని చుట్టేసిన అమిత్ షా

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య తదితర నేతల ఆధ్వర్యంలో అలహాబాద్ నగరమంతా చుట్టేశారు. చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహానికి పూల మాల వేసి అమిత్ షా.. రోడ్ షోకు శ్రీకారం చుట్టారు. యూపీ మధ్య, తూర్పు ప్రాంతాలకు దిగువున ఉన్న జిల్లాల్లోని 53 సీట్లల్లో బీజేపీ, ఎస్సీ-కాంగ్రెస్, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పలువురు అభ్యర్థుల మధ్య పోటీ కీలకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో ఎస్పీ 24, బీఎస్పీ 15, కాంగ్రెస్‌ 6, బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా, ఇతరులకు 3 స్థానాలు దక్కాయి. అలహాబాద్‌ మినహా మిగిలివన్నీ వెనుకబడిన జిల్లాలే.

A day of roadshows in UP as campaign ends for phase 4 of state elections

ఐదుగురు ప్రధానుల కేంద్రం అలహాబాద్

అయిదుగురు ప్రధానులకు ఎన్నికల క్షేత్రంగా నిలిచిన అలహాబాద్‌ పెద్ద జిల్లా. 2012 ఎన్నికల్లో 11 సీట్లలో 9 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకున్నది. కానీ ఈ స్థానాల నుంచి గెలుపొందిన వారిలో ఒక్కరికీ కూడా ఒక్కరికీ అఖిలేశ్‌ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కలేదు. మాజీ ప్రధానులు నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, వీపీ సింగ్, చంద్రశేఖర్‌లకు అనుబంధం ఉన్న అలహాబాద్‌-వెస్ట్‌ నియోజకవర్గం యూపీ వాసులందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ప్రతిష్టాత్మక అలహాబాద్‌ యూనివర్సిటీ విద్యార్థిసంఘం అధ్యక్ష పదవిని కైవసం చేసుకుని 2014లో వార్తల్లోకి ఎక్కిన రీచాసింగ్‌.. ఎస్పీ టికెట్‌పై అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీఎస్పీ సిటింగ్‌ ఎమ్మెల్యే పూజాపాల్‌ మూడోసారి విజయానికి ప్రయత్నిస్తున్నా ఆ అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పార్టీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ రంగంలో నిలిచారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి మనుమడైనా సిద్ధార్థ నాథ్ సింగ్‌ చాలా కాలంగా ఢిల్లీలో నివసించడం ఆయనకు ప్రతికూలాంశమని చెప్తున్నారు.

రాజా భయ్యా మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగానే

ప్రతాప్‌గఢ్‌ జిల్లా కుందా నుంచి 1993 నుంచి వరుసగా అయిదుసార్లు ఎన్నికైన మంత్రి రఘురాజ్‌ప్రతాప్‌ సింగ్‌ అలి యాస్‌ రాజా భయ్యా ఆరోసారీ స్వతంత్ర అభ్యర్థిగానే ఎస్పీ మద్దతుతో నామినేషన్‌ వేశారు. 'బాహుబలి' నేతగా పేరొందిన రాజా భయ్యా గతంలో కల్యాణ్‌సింగ్, రాంప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్‌సింగ్‌ , ములాయం కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఓ పోలీసు అధికారి హత్య కేసులో ఆయన పేరు రావడంతో 2013లో అఖిలేశ్‌ కేబినెట్‌ నుంచి తప్పుకున్నా.. తర్వాత పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చాక తిరిగి మంత్రి అయ్యారు. ఇదే జిల్లాలోని రాంపూర్‌ ఖాస్‌ నుంచి వరుసగా 9 సార్లు గెలిచిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ప్రమోద్‌తివారీ కూతురు, సిటింగ్‌ ఎమ్యెల్యే ఆరాధనా మిశ్రా రెండోసారి పోటీచేస్తున్నారు.

రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అదితి సింగ్

నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి దూరమై మళ్లీ అందులో చేరిన సీనియర్‌ నేత అఖిలేశ్‌కుమార్‌ సింగ్‌ కూతురు అదితీ సింగ్‌ ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌పై రాయ్‌బరేలీ నుంచి పోటీచేస్తున్నారు. 2012 ఎన్నికల్లో అఖిలేశ్‌ పీస్‌ పార్టీ టికెట్‌పై గెలిచారు. బీఎస్పీ అభ్యర్థి షాబాజ్‌ఖాన్, ఆరెల్డీ నేత భారతీ పాండే నుంచి అదితి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

ఇదే జిల్లాలోని ఊంచాహర్‌ స్థానంలో బీఎస్పీ నుంచి బీజేపీలోకి ఎన్నికల ముందు ఫిరాయించిన మాజీ మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య కొడుకు ఉత్కర్ష కమలదళం తరఫున పోటీ చేస్తున్నారు. ఫూల్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కేశవ్‌ప్రసాద్‌ మౌర్య రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కావడంతో అలహాబాద్ జిల్లాలోని అన్ని సీట్లను పోటీని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎస్పీ వ్యవస్థాపక నేత ములాయం కేబినెట్‌లో పనిచేసిన మాజీ ఎంపీ రేవతీ రమణ్‌సింగ్‌ మనవడు ఉజ్వల్‌ రమణ్‌ ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న కర్ఛనా స్థానం కూడా కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+