బిహార్లో నకిలీ పోలీస్ స్టేషన్.. వ్యవహారం ఎలా బయటపడిందంటే
బిహార్కు చెందిన ఒక ముఠా పోలీసుల వేషం వేసుకుని, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరుస్తామని ప్రజలను మోసం చేస్తున్న వ్యవహారం బయటపడింది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దుర్వినియోగం చేస్తున్న వారి గురించి వార్తాకథనాలు వచ్చాయి. గృహాల కేటాయింపు.. మరణించిన వారి ఖాతాల్లో సొమ్ము మళ్లించడం.. కేంద్రప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బును దొంగలిస్తున్న లాంటి కేసులు కూడా బయటపడ్డాయి.
కానీ, ప్రస్తుతం బిహార్ లోని బాంకా జిల్లాలో నకిలీ పోలీసులు ప్రజలను దోచుకుంటున్న కేసు బయటపడింది. ఈ మోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కేటాయింపు పేరుతో జరుగుతున్నట్లు తెలిసింది. దీనికోసం నగరం నడిబొడ్డున గత 8 నెలలుగా ఒక కార్యాలయాన్ని కూడా నడుపుతున్నారు.
ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతోంది?
బాంకా జిల్లాలో పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరుతో కొంత మంది ప్రజలను మోసం చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. బాంకా పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలోనే స్కార్ట్ పోలీస్ పట్నా అనే పేరుతో ఒక ముఠా నకిలీ పోలీసు స్టేషన్ను నడుపుతోంది.
బాంకా పోలీస్ స్టేషన్ హెడ్ శంభు యాదవ్ బీబీసీకి ఈ కేసు వివరాలను తెలిపారు.
"పోలీసులు బుధవారం ఉదయం నగరంలో గస్తీ నిర్వహిస్తుండగా ఒక మహిళ అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. ఆమె పోలీసు యూనిఫాం ధరించి ఉన్నారు. కానీ, ఆమె ధరించిన డ్రెస్ లో ఏదో లోపం కనిపించింది. అనుమానం రావడంతోనే, ఆమెను ప్రశ్నించాం. ఆమెను ప్రశ్నించగానే పారిపోవడానికి ప్రయత్నించారు. పారిపోతున్న ఆమెను పోలీసులు పట్టుకుని విచారణ చేయగా, నిజాలు బయటపడ్డాయి".
"నగరంలోని అనురాగ్ గెస్ట్ హౌస్లో ఒక గదిలో నిర్వహిస్తున్న ఆఫీసుకు ఆమె కాపలాదారుగా పని చేస్తున్నారు. ఆమెతో పాటు మరొక అబ్బాయి కూడా అక్కడే వాచ్మ్యాన్ గా పని చేస్తున్నారు".
"అనురాగ్ గెస్ట్ హౌస్ లోని రెండు గదుల నుంచి ఒక నకిలీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 8 నెలల నుంచి ఈ ఆఫీసును నడుపుతున్నారు. ఈ ఆఫీసులో ఉన్న సిబ్బంది ప్రజలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఇందిర ఆవాస్ యోజన, జల్-నల్, ప్రజా పంపిణీ వ్యవస్థ లాంటి పథకాల ద్వారా గృహాలు, మంచి నీరు లాంటి ప్రయోజనాలను అందచేస్తామని చెబుతూ ప్రజలను మోసం చేసేవారు".
ఈ కార్యాలయం బయట ఒక అమ్మాయిని, అబ్బాయిని వాచ్ మ్యాన్ లుగా నియమించి ప్రజలకు అనుమానం రాకుండా చూసుకునేవారు. ఈ ఆఫీసు నుంచి బిహార్ ఫుడ్ అండ్ సప్లై కార్పొరేషన్ కు సంబంధించిన చాలా రకాల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు.
ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం, ఫుల్లీదుమార్ గ్రామంలో నివసించే భోళా యాదవ్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారి అని తెలుస్తోంది. ఆయన పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు. కార్యాలయంలో పని చేసేవారికి ఆయన రోజు కూలీ కింద రోజుకు రూ. 500 ఇచ్చేవారు. పోలీస్ శాఖకు చెందినవిగా భావిస్తున్న కొన్ని పత్రాలు, నకిలీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు.
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
- '11 నెలల్లో 11 డోసుల కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్న వృద్ధుడు’... తర్వాత ఏమైందంటే..
పోలీసు ఉద్యోగాల పేరుతో మోసం
పోలీసు ఉద్యోగాలిస్తామంటూ స్థానికులను మోసం చేశారా అని ప్రశ్నించినప్పుడు, వారు అవునని సమాధానమిచ్చారు. అక్కడ పని చేస్తున్న వాచ్ మ్యాన్లతో కూడా ఇదే మోసానికి పాల్పడ్డారు.
పోలీసు ఉద్యోగాలిప్పిస్తామనే పేరుతో వాళ్ళ దగ్గర నుంచి రూ. 90,000, రూ.55,000 రూ తీసుకున్నట్లు చెప్పారు. వాళ్లకు పోలీస్ యూనిఫాం వంటి నకిలీ దుస్తులను ఇచ్చారు. ఆయుధాల పేరుతో నాటు తుపాకీని ఇచ్చారు.
ఇక్కడ స్థానికుల నుంచి జిల్లా కమాండర్ ఆఫీసు పేరుతో దరఖాస్తులను తీసుకుంటున్నట్లు తెలిసింది. వీళ్లు ప్రజలను మోసం చేసేందుకు ఒక నకిలీ కార్యాలయం వాతావరణాన్ని సృష్టించారు. మిగిలిన విషయాలు విచారణలో తేలుతాయని చెప్పారు.
బాంకా జిల్లా ఎస్డీపీఓ దినేష్ చంద్ర శ్రీవాస్తవతో బీబీసీ మాట్లాడింది.
రోడ్డు పై నకిలీ పోలీసు మహిళను ఆయనే మొదట చూసినట్లు చెప్పారు.
"ఆమె చేతిలో పిస్టల్ ఉండటంతో ఆమెను చూడగానే అనుమానం వచ్చింది. మహిళా కానిస్టేబుల్ చేతిలో పిస్టల్ ఉండదు. తర్వాత అది నాటు పిస్టల్ అని తెలిసింది" అని చెప్పారు.
"పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె దగ్గర నుంచి భోళా యాదవ్ రూ. 55,000 తీసుకున్నట్లు విచారణలో తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనేది విచారణలో తెలుస్తుంది" అని చెప్పారు.
- అవినీతి, బంధుప్రీతిపై నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడారు? ప్రధాని టార్గెట్ ఎవరు?
- 'అతడు' తప్పిపోయిన కుమారుడినంటూ 41 ఏళ్లు ఓ కుటుంబాన్ని మోసం చేశాడు, ఆస్తులన్నీ అమ్మేశాడు
స్థానిక విలేఖరులు ఏమంటున్నారు?
నగరంలోని అనురాగ్ గెస్ట్ హౌస్ నుంచి నకిలీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక దైనిక్ భాస్కర్ విలేఖరి ప్రిన్స్ రాజ్ చెప్పారు.
"ఇక్కడ పని చేసే ఇద్దరు ఉద్యోగులు అధికారులమని చెప్పుకుంటూ చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఇప్పిస్తామనే పేరుతో స్థానికులను మోసం చేసేవారు. ఆఫీసులో పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించలేదు" అని చెప్పారు.
"బాంకా జిల్లాలో నకిలీ పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్నారని వచ్చిన వార్తలు నిజమైనవి కావు. కేంద్ర రాష్ట్ర పథకాల ప్రయోజనాలను ఇప్పిస్తామంటూ మోసం చేసిన మాట నిజం కానీ, నకిలీ పోలీసు స్టేషన్ నిర్వహిస్తున్నారని చెప్పిన మాటల్లో నిజం లేదు" అని చెప్పారు.
స్థానిక మీడియాలో నకిలీ పోలీస్ స్టేషన్ గురించి వచ్చిన వార్తలు తప్పు అని తేలింది.
ఇవి కూడా చదవండి:
- ''చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- ద్రవ్యోల్బణం: పెట్రోలు ఖర్చని బంధువుల ఇంటికి వెళ్లడం లేదు, ఎవరైనా పెళ్లికి పిలిచినా వెళ్లలేకపోతున్నారు
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- అఫ్గానిస్తాన్లో హిందూ మైనారిటీల పరిస్థితి ఏమిటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)