ఓ ఫ్యామిలీని భయపెట్టిన సెల్ఫోన్ రింగ్టోన్
ఉడుపి: ఓ కుటుంబం కొన్ని రోజులుగా సెల్ఫోన్ రింగ్టోన్తో భయాందోళనకు గురైంది. ఆ భయానికి కారణం తెలిసి ఊపిరిపీల్చుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపూర్ తాలూకాలోని వండ్సే గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గోవింద అనే వ్యక్తి తన కుటుంబంతో సహా వండ్సే గ్రామంలో జీవిస్తున్నారు. ఒకరోజు సాయంత్రం వారి పెరట్లోని కొబ్బరి చెట్టు నుంచి ఉన్నట్టుండి చిన్నపిల్లోడి నవ్వులు వినిపించాయి. ఆశ్చర్యపోయిన గోవింద కుటుంబ సభ్యులు చెట్టువైపు తేరిపార చూశారు.
అక్కడ ఎవరూ కనిపించలేదు, కానీ పిల్లోడి నవ్వులు మాత్రం కొద్దిసేపు కొనసాగి ఆగిపోయాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన గోవింద వెంటనే వెళ్లి ఓ జ్యోతిష్యుడిని సంప్రదించాడు. చెట్టుమీద దుష్టశక్తులు ఉండవచ్చునని, వెంటనే అక్కడ హోమం చేయాలని జ్యోతిష్యుడు చెప్పారు.
వెంటనే హోమానికి ఏర్పాట్లు చేసి, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ, ఆ రోజు సాయంత్రం మళ్లీ ఆ నవ్వులు వినిపించాయి. అవి ప్రతి సాయంత్రం కొనసాగుతున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో కొబ్బరి చెట్లెక్కే సీనా పూజారి వారింటికి వచ్చాడు.
సమస్యను పరిష్కరించిన పూజారి.. ఆ సమస్యకు తానే కారణమని వారికి చెప్పడంతో గోవింద కుటుంబం ఆశ్చర్యానికి గురైంది. అసలు విషయానికి వస్తే.. పూజారికి కొంచెం మతిమరుపు. ఒకరోజు కొబ్బరికాయలు కోసేందుకు గోవింద ఇంటికి వచ్చిన పూజారి తన సెల్ఫోన్ను ఒక ప్లాస్టిక్ సంచిలో చుట్టి చెట్టు మీదే పెట్టి దిగిపోయాడు.
ఇంటికివెళ్లిన తర్వాత తన ఫోన్ కనిపించని సంగతి గుర్తించాడు.. కానీ చెట్టు మీద పెట్టిన సంగతిని మరిచిపోయాడు. వేరే ఫోన్ల నుంచి తన నంబర్కు ఫోన్ చేశాడు. కాలర్ ట్యూన్గా చిన్నపిల్లాడి నవ్వులు ఉండటంతో అవి గోవింద కుటుంబానికి వినిపించేవి. పూజారి రోజూ పని నుంచి ఇంటికి రాగానే తన ఫోన్కోసం వెతికేవాడు.
తనకు రింగ్ శబ్ధం వినిపిస్తుండటంతో.. అది చోరీకి గురి కాలేదని, ఎక్కడో పడిపోయిందని గ్రహించి, తాను కొబ్బరి చెట్లెక్కిన ఇళ్లన్నీ వెతకడం ప్రారంభించాడు. కాగా, చివరకు గోవింద ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై ఉన్న సెల్ ఫోన్ తెచ్చుకున్నాడు సీనా పూజారి. దీంతో ఆ కుటుంబాన్ని భయాందోళనకు గురి చేసిన చిన్నోడి నవ్వుల కథ సుఖాంతమైంది.