దారుణ హత్య : నడిరోడ్డుపై.. తండ్రీకొడుకులు కత్తులతో పొడిచేశారు
గోకుల్ నగర్ : తండ్రీకొడుకులు కలిసి నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన గుజరాత్ లోని గోకుల్ నగర్లో చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే.. సదరు వ్యక్తిని వెంబడిస్తూ తరుముకొచ్చిన తండ్రీకొడుకులు కత్తితో అతనిపై దాడి చేసి.. ఆపై రాళ్లతో కొట్టి హత్య చేసినట్టుగా తెలుస్తోంది.
చనిపోయిన వ్యక్తిని అమాలియాగా గుర్తించారు. అమాలియాను తరుముతూ బైక్ పై అతని వెనకాలే వచ్చారు తండ్రీకొడుకులు. అనంతరం నడిరోడ్డుపై అతన్ని పట్టుకుని కత్తితో పొడిచి, రాళ్లతో కొట్టి పరారయ్యారు. అనంతరం రెండు గంటల పాటు నడిరోడ్డుపైనే అమాలియా కొనఊపిరితో కొట్టుమిట్టాడు. రెండు గంటల తర్వాత అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలోనే కన్నుమూశాడు.
కాగా, హత్యకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులిద్దరినీ గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.