Farm house: కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో నరకం చూపించి హత్య, ఆరు నెలలకు లీక్ !
బెంగళూరు/చిక్కబళ్లాపురం: డబ్బుల కోసం ఓ యువకుడిని కిడ్నాప్ చేసి ఓ ఫామ్హౌస్లో నిర్బంధించి అతి దారుణంగా హత్య చేశారు. ఆరు నెలల తరువాత యవకుడిని హత్య చేసిన విషయం వెలుగుచూసింది. యమలోకంలోని నరకంలో కూడా ఇంతదారుణంగా హింసలు పెట్టలేరని ఈ విషయం తెలిస్తే అర్థం అవుతోంది. అయితే అప్పు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఓ యువకుడిని చిత్రహింసలకు గురి చేసిన తీరుచూసి, ఆ వీడియోలు చూసి పోలీసులు చలించిపోయారు. ఐటీ హబ్ లో డబ్బు సంపాధించాలని, మంచి ఉద్యోగం చేసి సుఖంగా ఉండాలని అనుకున్న ఓ యువకుడి జీవితం సర్వనాశనం అయ్యింది.

బెంగళూరు యువకుడు
వడ్డీ వ్యాపారం చేస్తున్నవాళ్లు యువకుడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత ఈకేసు వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని కోణణేకుంటేలో శరత్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. ఆరు నెలల క్రితం శరత్ ను శరత్ కుమార్ అనే యువకుడు, అతని స్నేహితులు కిడ్నాప్ చేశారు. చిక్కబళ్లాపుంలో నివాసం ఉంటున్న శరత్ కుమార్ దగ్గర బెంగళూరులో నివాసం ఉంటున్న శరత్ అప్పు తీసుకున్నాడు.

చిక్కబళ్లాపురంలో వడ్డీ వ్యాపారి
కిడ్నాప్కు గురైన శరత్ను చిక్కబళ్లాపూర్ సమీపంలోని ఫామ్హౌస్లోకి తీసుకెళ్లి డబ్బులు తిరిగి చెల్లించాలని చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కసితో శరత్ ను కిడ్నాప్ ఫామ్ హౌస్ లో అతని కాళ్లు చేతులు కట్టేసి బంధించారు. శరత్ను అర్ధనగ్నంగా ఓ గదిలో ఉంచారు. శరత్ ను అర్ధనగ్నంగా చేసి ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు. తోటలోని మామిడి చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టారని వెలుగు చూసింది. రక్తం గడ్డకట్టేంత వరకు శరత్ ను చితకబాదేశారు.

నరకం చూపించి చంపేశారు
శరత్ను ఆరు నెలలుగా నిరంతరం చిత్రహింసలు పెట్టడంతో పాటు సరైన ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా ప్రత్యక్ష నరకం చూపించారు. శరత్ అక్కడి నుంచి తప్పించుకోకుండా చీకటి గదిలో నిర్బందించారు. రాత్రి పూట శరత్ అరవకూడదని అతని నోటికి గుడ్డలు కుక్కేశారు. సినిమా స్టైల్లో విలన్లు లాగా శరత్ కుమార్, అతని స్నేహితులు రెచ్చిపోయారు. విపరీతమైన దెబ్బలు కోట్టడం, భోజనం కూడా పెట్టకపోవడంతో శరత్ అనారోగ్యానికి గురైనాడు. అయినా శరత్ ను వదిలిపెట్టకుండా చితకబాది అతన్నిచంపేశారు.

డౌట్ వస్తుందని కారులో శవం ఎత్తుకెళ్లి ?
శరత్ మృతదేహాన్ని ఫామ్ హౌస్ లో పూడ్చిపెడితే అనుమానాలు వస్తాయని భావించి అతని మృతదేహాన్ని కారులో కర్ణాటకలోని చార్మాడి ఘాట్లోకి తీసుకెళ్లి అక్కడ విసిరేశారు. శరత్ మృతదేహం లభ్యంకాని, హత్య చేసింది తామేనని ఎలాంటి క్లూ లభించని విధంగా ఫామ్ హౌస్ లో సాక్ష్యాలను నాశనం చేశారు. శరత్ హత్యకు గురై ఆరు నెలలు పూర్తి అయినా ఎవ్వరికీ అనుమానం రాకుండా శరత్ కుమార్, అతని స్నేహితలు జాగ్రత్తలు తీసుకున్నారు.

శరత్ మొబైల్ నుంచి మెసేజ్ పంపించారు
కిడ్నాప్కు గురైన శరత్ మొబైల్ ఫోన్ నుంచి అతని కుటుంబ సభ్యుల మొబైల్ కు మెసేజ్ పంపించారు. నేను చాలా అప్పు చేశాను. రుణం తీర్చడానికి డబ్బులు సంపాధించడానికి వెలుతున్నాను, కొన్ని నెలల తరువాత నేను వస్తాను, నా కోసం ఎవరూ వెతకవద్దని శరత్ కుటుంబసభ్యులకు మెసేజ్ చేశారు. తరువాత శరత్ మొబైల్ను లారీపై పడేశారు. లారీ వేరే రాష్ట్రానికి వెళ్లిపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఈ మెసేజ్ చూసి కుటుంబ సభ్యులు కూడా శరత్ కోసం వెతకడంమానేసి అతనే తిరిగి వస్తాడని ఇంతకాలం ఎదురుచూశారు.

ఆరు నెలలకు మ్యాటర్ లీక్ అయ్యింది
ఆరు నెలలు గడిచినా శరత్ హత్య విషయం ఎవరికీ తెలియలేదు. శరత్ తల్లిదండ్రులు కూడా తమ కొడుకు ఉద్యోగం కోసం బయట ఊరికి వెళ్లాడని అందరికి చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు శరత్ హత్య గురించి పోలీసులకు మ్యాటర్ లీక్ అయ్యింది. హంతకుల మొబైల్ ఫోన్లలో శరత్ ను చిత్రహింసలకు గురి చేసిన సమయంలో తీసిన వీడియోలు ఉండటంతో అందరూ అడ్డంగా చిక్కిపోయారు. హత్యకు గురైన యువకుడి పేరు శరత్, హత్య చేసిన నిందితుడి పేరు కూడా చిక్కబళ్లాపురంకు చెందిన శరత్ కుమార్ అని పోలీసులు అన్నారు. శరత్ హత్య కేసులో శరత్ కుమార్, శరత్, మంజునాథ్, శ్రీధర్, వెంకటాచలపతి, ధనుష్లను బెంగళూరులోని కబన్ పార్క్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications