రియల్ వ్యాపారిని వెంటాడి చంపిన తమ్ముడు
బెంగళూరు: ఆస్తి వివాదం కారణంగా సోంత అన్నను నడి రోడ్డు మీద వెంటాడి దారుణంగా హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలోని బాణసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచేరకనహళ్ళిలో నివాసం ఉంటున్నమంజునాథ్ అలియాస్ మంజు (38) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురైనాడు.
మంజునాథ్, మధు సోదరులు. మంజుతో కలిసి ఆమె తల్లి నివాసం ఉంటున్నది. మంజు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అన్నదమ్ముల మద్య ఆస్తి వివాదం ఉంది. ఈ మద్యనే వీరు ఆస్తిని విక్రయించారు. వచ్చిన సోమ్ములో తమ్ముడు మధుకు ఇచ్చారు. అయితే తన అన్న మంజు తనను మోసం చేశాడని మధు భావించాడు.
ఇదే విషయంలో నిత్యం ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగేది. పెద్దలు, బంధువులు, స్థానికులు ఇద్దరికి నచ్చ చెప్పేవారు. అయితే మధు అన్న మంజు మీద కక్ష పెంచుకున్నాడు. తనను మోసం చేసిన అన్నను అంతం చెయ్యాలని అనుకున్నాడు.
బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మధు తన అన్నకు ఫోన్ చేశాడు. ఇంటి సమీపంలోని 100 మీటర్ల దూరంలో ఉన్న టీ దుకాణం దగ్గరకు రావాలని చెప్పాడు. తమ్ముడు ఏదో మాట్లాడటానికి రమ్మని పిలుస్తున్నాడని భావించిన మంజు అక్కడికి వెళ్లాడు.
అప్పటికే అక్కడ ఉన్న మధు ఒక్క సారిగా వేటకొడవలి తీసుకుని అన్న మంజును ఇష్టం వచ్చినట్లు నరికాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన అన్న మంజును వెంటాడి దాడి చేశాడు. టీ దుకాణం దగ్గర ఉన్న వారు, స్థానికులు మధును అడ్డుకోవడానికి ధైర్యం చెయ్యలేకపోయారు.
వెంటనే మంజును ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు అన్నారు. బంధువుల ఇంటిలో తలదాచుకున్న మధును అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు అడిషనల్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్ తెలిపారు.