తోటి ప్రయాణికుడిపై మూత్రం పోశాడు: న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ఘటన
న్యూఢిల్లీ: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికన్ ఎయిర్ లైన్స్కు చెందిన ఓ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు.. మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటలకు విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని చెప్పారు. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఘటనపై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారి మాట్లాడుతూ.. ఓ భారతీయ ప్రయాణికుడు.. న్యూయార్క్ నుంచి అమెరికా ఎయిర్లైన్స్కు చెందిన విమానం నెం. ఏఏ 292 విమానంలో ఢిల్లీ వస్తున్నాడు. మద్యం మత్తులో అతడు తోటి ప్రయాణికుడిపై మూత్రం పోశాడు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)కు సమాచారం అందించారని తెలిపారు.

అనంతరం నిందితుడిని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కు తరలించాయని ఆయన తెలిపారు. నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా ఎయిర్ లైన్స్ తమకు ఫిర్యాదు చేసిందని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ డీసీపీ దినేష్ కుమార్ మహ్లా తెలిపారు. నిందితుడిని ఢిల్లీకి చెందిన ఆర్య వోహ్రాగా గుర్తించామని చెప్పారు. నిందితుడు తోటి ప్రయాణికుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అయితే, బాధితుడి నుంచి ఇంకా ఎలాంటి పిర్యాదు అందలేదని తెలిపారు. నెల రోజుల క్రితం అమెరికన్ ఎయిర్లైన్స్లో ఓ ప్రయాణికుడు తన పక్కనే కూర్చున్న వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనలోనూ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. అంతకుముందు ఎయిర్ ఇండియా విమానంలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తోటి ప్రయాణికురాలైన వృద్దురాలిపై న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఈ ఘటన కలకలం రేపింది. విమానం ల్యాండైన తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతడిపై విమానయాన సంస్థలు కూడా చర్యలు తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications