చిరుతకు చుక్కలు చూపించాడు.. బైక్కు కట్టి పట్టుకెళ్లాడు..!!
బెంగళూరు: సింహం, పులి, చిరుత.. వంటి వణ్యప్రాణులు కళ్లముందు కనిపిస్తే పరుగు లంగించుకుంటుంటారు. దాని పంజా దెబ్బ రుచి చూడకుండా ఉండటానికి పరుగులు పెడుతుంటారు. కర్ణాటకలో మాత్రం ఓ వ్యక్తి రివర్స్ అయ్యాడు. తనపై దాడి చేసిన ఓ చిరుతను వెంబడించాడు.. పరుగులు పెట్టించాడు. దాన్ని కేబుల్ వైర్లతో కట్టి పడేశాడు. గొర్రె పిల్లలా బైక్కు కట్టి పట్టుకెళ్లిపోయాడు.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ అనూహ్య సంఘటన సంభవించింది. తనపై దాడి చేసిన ఓ చిరుతకు చుక్కలు చూపించాడో వ్యక్తి. సినీ ఫక్కీలో దానితో పోరాడాడు.. పైచేయి సాధించాడు. అక్కడితో ఆ చిరుతను వదల్లేదు. దాన్ని తన బైక్కు కట్టి పట్టుకెళ్లాడు. అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఆ ఘనుడి పేరు వేణుగోపాల్ అలియాస్ ముత్తు. హసన్ జిల్లాలోని అరసికెరె తాలూకా పరిధిలోని గండసి మండలం బాగివాళు గ్రామంలో నివాసిస్తుంటాడు. గ్రామంలో అతనికి పొలం ఉంది. పొలం పనుల కోసం వెళ్లిన సమయంలో వేణుగోపాల్పై ఓ చిరుత దాడి చేసింది. చిరుత దాడికి అతను అదరలేదు, బెదరలేదు.. తెగించి పోరాడాడు. విజయం సాధించాడు.
పారిపోవడానికి ప్రయత్నించిన చిరుతను బలమైన కేబుల్ వైర్లతో బంధించాడు. బైక్ వెనక దాన్ని కట్టి పట్టుకెళ్లాడు. నేరుగా మండల కేంద్రానికి వెళ్లి.. అటవీ శాఖ సిబ్బంది చేతుల్లో పెట్టాడా చిరుతను. హోరాహోరి పోరులో గాయపడ్డ చిరుతకు ప్రథమచికిత్సను అందించారు అటవీశాఖ సిబ్బంది. అనంతరం దాన్ని మైసూరు జూకు తరలించినట్లు తెలుస్తోంది.
హసన్ జిల్లాలో చిరుతల సంఖ్య ఎక్కువే. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉంటుంది ఈ జిల్లా. దట్టమైన పశ్చిమ కనుమల అడవుల్లో సంచరించే వన్యప్రాణులు తరచూ గ్రామాల్లోకి వస్తుంటాయి. ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు తరచూ పంట పొలాల్లో దర్శనం ఇస్తుంటాయి. వాటి నుంచి తమను కాపాడాలంటూ స్థానికులు అటవీశాఖకు విజ్ఞప్తి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.












Click it and Unblock the Notifications