బెంగళూరులో జార్ఖండ్ యువతిపై దాడి, బూతులు
బెంగళూరు: బెంగళూరు నగరంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తాను దెబ్బలు తిని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళా ఇంజనీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నది. బెంగళూరు పోలీసులు తనపట్ల నిర్లక్షంగా వ్యవహరించారని సోషల్ మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఆవేదనను ఒక ఆంగ్ల దినపత్రిక మంగళవారం పెద్ద అర్టికల్ ప్రచురించింది. జార్ఖండ్ రాజధాని రాంచికి చెందిన ప్రేరణ (22) అనే యువతి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చింది. ఈనెల 12వ తేదిన స్నేహితుడు భవేష్ తో కలిసి బైక్ లో బయలుదేరింది.
కుమారస్వామి లేఔట్ సమీపంలోని దయానంద సాగర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెళుతున్న సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న 25 నుండి 30 మంది యువకులు వీరిద్దరిని అడ్డగించి వేధింపులకు గురి చేశారు. వారి బైక్ తాళం లాక్కుని అల్లరి చేశారు.
తరువాత బాధితులు కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసులను ఆశ్రయించారు. అయితే కొంత సేపు వేచి ఉండాలని పోలీసులు సూచించారని, గంట తరువాత ఏమి జరిగిందని వివరాలు అడిగారని ప్రేరణ ఆరోపిస్తున్నది.
పోలీసులు వెంటనే స్పందించి ఉంటే అల్లరిమూకలను పట్టుకోవడానికి అవకాశం ఉండేదని ఆమె ఆరోపించారు. ఇదే విషయం పై ఈ నెల 15వ తేదిన సోషల్ మీడియా ద్వార ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారని అన్నారు.
అంతే కాకుండా ఇటివల ఉద్యోగం కోసం వివరాలు తెలుసుకోవడానికి వెళుతున్న సమయంలో 45 నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక వ్యక్తి తన స్కూటర్ ను బైక్ లో వెండించాడని ఆరోపించారు. అతను తన స్కూటర్ ను ఢీకొట్టడానికి ప్రయత్నించాడని అన్నారు.
తాను తప్పించుకోవడానికి ప్రయత్నించి చివరికి పడిపోయానని ప్రేరణ చెప్పారు. అయితే ఆ సందర్బంలో అతను బైక్ నుండి కిందకు దిగకుండా తనను బూతులు తిట్టడం మొదలు పెట్టాడని, ఆటో డ్రైవర్లు, స్థానికులు చుట్టు నిలబడి సినిమా చూశారు తప్ప తనకు ఎవ్వరు సహాయం చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ సందర్బంలో తన స్కూటర్ తాళం సైతం లాక్కోవడానికి ప్రయత్నించి తన శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి అక్కడ ఉన్న వారిని మొబైల్ అడిగినా ఎవ్వరు ఇవ్వలేదని అన్నారు.
చివరికి ఒక జార్ఖండ్ యువకుడు (మెహంది వాల) దగ్గర మొబైల్ తీసుకుని తన స్నేహితుడు భవేష్ కు సమాచారం ఇచ్చానని చెప్పారు. అతను సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్న సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేసి మా బైక్ ను డీకొనిందని తన మీద మండిపడ్డారని అన్నారు.
చివరికి అక్కడ ఉన్న వారు తన స్నేహితుడు భవేష్ మీద పిడిగుద్దులతో దాడి చేశారని, అడ్డు వెళ్లిన తన మీద హెల్మెట్ తో దాడి చెయ్యడంతో ముక్కు పగిలి రక్తం వచ్చిందని అన్నారు. అక్కడి నుండి తప్పించుకుని పోలీసుల దగ్గరకు వెలితే న్యాయం చెయ్యలేదని, మూడు గంటల తరువాత ప్రథమ చికిత్స అందించారని ప్రేరణ ఆరోపించింది. పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.