ఉజ్జయిని: ‘ముస్లిం చిరువ్యాపారిని బెదిరించి జై శ్రీరాం అనిపించిన యువకులు’
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఓ ముస్లింతో బలవంతంగా జైశ్రీరాం అని పలికించారన్న ఆరోపణలతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తుక్కు వ్యాపారం చేసే ఆ వ్యక్తిని జైశ్రీరాం అనాలంటూ బలవంతం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉజ్జయినికి 60 కిలోమీటర్ల దూరంలోని ఝరడా స్టేషన్ పరిధిలోని సేంకలీ గ్రామంలో జరిగింది.
దీనిపై సబ్డివిజనల్ పోలీస్ అధికారి ఆర్కే రాయ్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. ''ఈ కేసులో ఈశ్వర్ సింగ్, కమల్ సింగ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరినీ కస్టడీకి పంపించాం'' అన్నారు.
- ఎమర్జెన్సీ: దిల్లీలోని తుర్క్మాన్ గేట్ దగ్గర బుల్డోజర్ల విధ్వంసానికి కారణం సంజయ్ గాంధీ ఆలోచనలేనా?
- అసోంలో ముస్లిం మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారా.. గణాంకాలు ఏం చెబుతున్నాయి
ఇంతకీ ఏం జరిగింది?
ఉజ్జయినిలోని మాహిద్పుర్లోని ఫకీర్ మొహల్లాలో నివసించే 44 ఏళ్ల అబ్దుల్ రషీద్ గత 20 ఏళ్లుగా తుక్కు సేకరించే వ్యాపారం చేస్తున్నారు.
సమీప గ్రామాల్లో తిరుగుతూ తుక్కు, పాత వస్తువులు కొని మాహిద్పుర్లోని పెద్ద తుక్కు దుకాణాలకు విక్రయిస్తారు.
శనివారం సెంకలీ గ్రామంలో తుక్కు కొనుగోలు చేస్తుండగా ఇద్దరు యువకులు వచ్చి ఎవరి అనుమతితో ఇక్కడ వ్యాపారం చేస్తున్నావంటూ గదమాయించారు.
ఆ తరువాత ఆయన్ను కొట్టారు. ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అబ్దుల్ రషీద్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. ''నేను సెంకిలిలో తుక్కు కొంటున్నాను. మోటార్ సైకిల్ మీద వచ్చిన కొందరు యువకులు నన్ను ఆపి, ఎవరు నువ్వు? ఎవరినడిగి ఇక్కడ తుక్కు కొంటున్నావు? అన్నారు. నా బండిలో ఉన్న తుక్కంతా విసిరేసి నాతో దురుసుగా ప్రవర్తించారు'' అన్నారు.
ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ చాలామంది ఉన్నారని, వారంతా మౌనంగా ఉండిపోయారని రషీద్ చెప్పారు.
''నేను ఆ గ్రామం నుంచి వచ్చేస్తుండగా నన్ను మోటార్ సైకిళ్లపై వెంబడించారు. దారిలో ఆపి జైశ్రీరాం అని పలికించారు'' అన్నారు రషీద్.
ఈ ఘటన తరువాత రషీద్ బాగా భయపడిపోయారు.
''నేనీ విషయం ఎవరికీ చెప్పలేదు. చాలా భయపడ్డాను. కానీ, ఆ కుర్రాళ్లే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. అది చూసిన కొందరు నాకు ధైర్యం చెప్పడంతో నేను పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాను'' అన్నారు రషీద్.
- కర్నాటక: 'ఇక్కడ అగ్ర కులాల వారికే హెయిర్ కటింగ్ చేస్తాం' అంటూ దళితులను కొట్టారు
- సౌదీ అరేబియా: మక్కాలో దాడులు ఎందుకు జరుగుతున్నాయి... మహదీలంటే ఎవరు?
పోలీసులు భరోసా ఇచ్చారు
''పోలీసులకు జరిగిందంతా చెప్పాను. వారు ఆ ఇద్దరు కుర్రాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నాతో దురుసుగా ప్రవర్తించిన కుర్రాళ్లను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు''
కాగా ''వెంటనే చర్యలు తీసుకున్నాం. ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశాం. ముందుముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం'' అని ఎస్డీఓపీ ఆర్కే రాయ్ చెప్పారు.
https://twitter.com/FaisalNadeemAMU/status/1431668472971350019
ఇలా జరుగుతుందని ఏనాడూ అనుకోలేదు
ఇరవయ్యేళ్లుగా తాను ఇదే ప్రాంతంలో తిరుగుతున్నానని.. తనను ఇంతవరకు ఎవరూ అడ్డుకోలేదని రషీద్ చెప్పారు.
''నేనొక పేదవాడిని. తుక్కు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా పని నేను నిర్భయంగా చేసుకుంటుండేవాడిని. ఇలా జరుగుతుందని ఏనాడూ అనుకోలేదు'' అన్నారు రషీద్.
ఈ ఘటన తరువాత తనకు చాలా భయం వేస్తోందని చెప్పారాయన.
ఇకపై ఎక్కడికి వెళ్లాలన్నా భయపడుతూ వెళ్లాలి. బయటకు వెళ్లకపోతే కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా అని ఆవేదన చెందారు రషీద్.
- ఇమామ్లను బంధిస్తున్న చైనా అధికారులు
- పాకిస్తాన్: పాఠ్య పుస్తకాల ద్వారా హిందువులపై ద్వేషం పెంచుతోందా... హిందువులు ప్రపంచానికి శత్రువులా?
''ఇలాంటి ఘటనలు ఉజ్జయిని ప్రాంత ముస్లింలలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్థానిక ముస్లింలకు భరోసా కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.
ఈ కేసులో కూడా ఎఫ్ఐఆర్ కనుక నమోదు కాకపోతే ఎన్నో కేసుల్లా ఇదికూడా మరుగున పడిపోయేది'' అన్నారు ఉజ్జయినికి చెందిన సామాజిక కార్యకర్త షఫీ నాగోరీ.
'ఈ ప్రాంతంలో ఇటీవల ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాలక పార్టీకి చెందిన హిందూత్వకార్యకర్తలు వీటి వెనుక ఉన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటివి ఆగవు'' అన్నారు షఫీ.
భజరంగదళ్ ఉజ్జయిని యూనిట్ ఇన్చార్జ్ నీరజ్ కౌశల్ దీనిపై మాట్లాడుతూ.. హిందూ సంస్థల కార్యకర్తలెవరూ ఈ ప్రాంతంలో ఇలాంటి దాడికి పాల్పడలేదని చెప్పారు.
''ఇది పాత వీడియో అయినా కావొచ్చు, లేదంటే సామరస్య వాతావరణాన్ని చెడగొట్టేందుకైనా ఎవరో వైరల్ చేసి ఉండొచ్చు'' అన్నారు.
''కొద్దిరోజుల కిందటే మొహర్రం జరిగింది.. ముస్లింలు ర్యాలీ తీస్తే ఎవరూ అడ్డుకోలేదు కదా. కానీ, ఇక్కడ తాలిబాన్ తరహా ఆలోచనలున్న కొందరు సామరస్య వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న అమెరికా
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- 'పాకిస్తాన్లో కూడా జిహాద్ తప్పనిసరి.. అఫ్గాన్ షరియా వ్యవస్థను ఇక్కడా తేవాలి’ - పాక్ తాలిబాన్
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత 'వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'తాలిబాన్లు కూడా సాధారణ ప్రజలే, కాబుల్ ఇప్పుడు సురక్షిత నగరంగా మారింది' - రష్యా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)