ఉపాధి కోసం వెళితే..: కేరళలో ఒడిశా యువతి అనుమానాస్పద మృతి
తిరువనంతపురం: ఒడిశాకు చెందిన ఓ యువతి కేరళలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, పోలీసులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయిందని చెబుతున్నారు. కానీ ఇది ముమ్మాటికీ హత్యేనని బాధిత కుటుంబసబ్యులు ఆరోపిస్తున్నారు.
తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి తల్లిదండ్రులు జిల్లా కార్మికశాఖ అధికారులను వేడుకొంటున్నారు. దీనికి సంబంధించి మృతురాలు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని రాయగడ జిల్లా శేషికల్ పోలీస్స్టేషన్ పరిధి పిప్పలగూడ గ్రామానికి చెందిన మియల్పయి, ఎర్క తాడింగిల కుమార్తె సైంత్రితాడింగి(18) ఉపాధి కోసం ఆర్నేళ్లకిందట కేరళ వెళ్లింది.
తాడింగితో పాటు అదే గ్రామానికి చెందిన వూర్మిళ మండంగి అనే మరో యువతిని దంగలోడి గ్రామానికి చెందిన రామతాడింగి అనే మధ్యవర్తి పనికోసం కేరళ తీసుకెళ్లాడు. గత అక్టోబర్లో తీసుకెళ్లిన రామ వీరిద్దరినీ ఇళ్లల్లో పనిమనిషులుగా చేర్పించాడు. అప్పటినుంచి కుమార్తె నుంచి ఎలాంటి సందేశం, సమాచారం తమకందలేదని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సైంత్రి మృతి విషయమై ఎర్నాకుళం జిల్లా కోచి నగరం, ఎలమక్కర పోలీసుల నుంచి ఆదివారం సాయంత్రం రాయగడ కార్మికశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న అరుణ్లెంకాకు సమాచారమందింది. దీంతో విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కార్మికశాఖ కార్యాలయానికి చేరుకొని తమ కుమార్తె మృతదేహాన్ని రప్పించి తగు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు.
కాగా, బాధిత యువతి మృతదేహాన్ని రప్పించేందుకు తగు ఏర్పాట్లతో పాటు ఆమె మృతికి కారణాలతో విచారణ జరిపించేలా చూస్తామని కార్మికశాఖ ఇన్స్పెక్టర్ సంజయ్కేసరి ప్రధాన్ హామీ ఇచ్చారు.