పాక్ ఐఎస్ఐతో లింక్: ప్రభుత్వ టీచర్ అరెస్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చెయ్యడానికి పాకిస్థాన్ కు చెందిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు కుట్ర పన్నారని అధికారులు గుర్తించారు. ఈ దాడులు అమలు చెయ్యడానికి సహకరిస్తున్న ప్రభుత్వ టీచర్ ను శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
జమ్మూకు చెందిన సబీర్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఢిల్లీలో రద్దిగా ఉండే ప్రాంతాలు, ప్రముఖ వ్యక్తులపైనా దాడులు చెయ్యడానికి లష్కర్ ఏ తోయిబా కుట్ర పన్నిందని అధికారులకు తెలిసింది.
వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పాకిస్థాన్ కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్ఐకి అనుకూలంగా జమ్మూకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ పని చేస్తున్నాడని అధికారులు గుర్తించారు. వెంటనే ప్రభుత్వ టీచర్ సబీర్ ను అరెస్టు చేశారు.
సబీర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఢిల్లీలో లష్కర్ ఏ తోయిబా దాడులకు కుట్ర పన్నుతున్నదని వెల్లడించారు. నుమన్, ఖుర్షీద్, జైదీ లాంటి మారు పేర్లతో ఢిల్లీలో దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న లష్కర్ ఏ తోయిబా ఏజెంట్ల కోసం గాలిస్తున్నారు.
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వీరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఏజెంట్లతో పాక్ లో ఉన్న లష్కర్ కమాండర్లు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
ఇప్పటికే ఐఎస్ఐతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై భారత్ రిటైడ్ ఆర్మీ జవానును పోలీసులు అరెస్టు చేశారు. గతంలో జమ్మూ కాశ్మీర్ లో చురుగ్గా పని చేసిన లష్కర్ ఏజెంట్లు ఉకాషా, దుజన దాడులకు సాంకేతిక సహకారం అందించేందుకు ఢిల్లీ వచ్చారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.