స్మగ్లింగ్: ఎయిర్ ఇండియా పైలెట్ అరెస్టు
ముంబై: ఎయిర్ ఇండియాలో సుధీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్ పైలెట్ బంగారం స్మగ్లింగ్ చూస్తు అడ్డంగా బుక్కయ్యాడు. అతని దగ్గర ఉన్న బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్న ముంబై కస్టమ్స అధికారులు కేసు నమోదు చేశారు. తరువాత ఆ పైలెట్ ను బెయిల్ మీద విడుదల చేశారు.
బుధవారం రాత్రి ఎయిర్ ఇండియాలో పని చేస్తున్న సీనియర్ పైలెట్ ఒకరిని ముంబై విమానాశ్రంలో కస్టమ్స్ అధికారులు పరిశీలించారు. ఆయన దగ్గర రూ. 16 లక్షల విలువైన 600 గ్రాముల 7 బంగారు కడ్డీలు ఉన్న విషయం గుర్తించారు. ఏమిటని ఆ పైలెట్ ను ప్రశ్నించారు.
తాను స్మగ్లింగ్ చేశానని ఆ పైలెట్ అంగీకరించాడు. వెంటనే ఎయిర్ ఇండియా ఇంటిలిజెన్స్ విభాగానికి సమాచారం ఇచ్చారు. తరువాత ఆ పైలెట్ మీద కేసు నమోదు చేసి అనంతరం బెయిల్ మీద విడుదల చేశామని ముంబై విమానాశ్రయ అధికారులు చెప్పారు.
సాధారణంగా విమానంలో ప్రయాణించే ప్రయాణికులతో పాటు పైలెట్లు, సిబ్బందిని చెక్ చేస్తామని, అందులో భాగంగా పైలెట్ ను చెక్ చెయ్యగా విషయం వెలుగు చూసిందని అధికారులు చెప్పారు. పైలెట్ పేరు చెప్పడానికి ఎయిర్ ఇండియా అధికారులు నిరాకరించారు.