అది పొట్టా.. గల్లాపెట్టా?: వ్యక్తి కడుపులోంచి 170 నాణేలు తీశారు
రాయచూరు: ఆయనది పొట్టా లేక గల్లా పెట్టా? అని సందేహ పడ్డారు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు. ఆయన కడుపులో నుంచి ఏకంగా 170 నాణేలను బయటికి తీశారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రాత్రి ఈ శస్త్ర చికిత్సను విజయవంతం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రెక్కారిపల్లికి చెందిన ఈశ్వరరెడ్డి కుటుంబం కర్ణాటకలోని రాయచూరు జిల్లా బసవపుర క్యాంపులో స్థిరపడింది. 18 నెలల క్రితం ఈశ్వర రెడ్డి(40) మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. బయట తిరిగిన సమయంలో పాదచారులు ఇచ్చిన రూ. 1, 2, 5 నాణేలను మింగాడు.
కాగా, అతడి కోసం గాలించిన కుటుంబసభ్యులు చివరికి ఇంటికి తీసుకొని వచ్చారు. ఆయన మానసిక స్థితి కుదుటపడినా, గత నెల రోజులుగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీంతో బళ్లారిలోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వివిధ పరీక్షల అనంతరం ఈశ్వరరెడ్డి కడుపులో నాణేలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
మంగళవారం రాత్రి డాక్టర్ రవి రెడ్డి నేతృత్వంలోని స్థానిక వైద్యుల బృందం శస్త్ర చికిత్స నిర్వహించి 170 నాణేలను వెలికి తీసింది. సుమారు 18 నెలలుగా నాణేలను కడుపులో ఉండటంతో కొన్ని తుప్పు పట్టి స్వరూపమే మారిపోయాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈశ్వర రెడ్డి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు.