కొత్తా దేవుడండీ..!!
లక్నో: రాజకీయ నాయకులు, సినిమా స్టార్లకు అభిమానులు ఆలయాలను కట్టేస్తుంటారు. వివిధ రూపాల్లో వారిని కొలుస్తుంటారు. వెంకటేశ్వరుడిగా, శ్రీరామచంద్రుడిగా, షిర్డీ సాయిబాబాగా బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టిన సందర్భాలు దేశ రాజకీయాల్లో చాలా ఉన్నాయి. ఇక పాలాభిషేకాల గురించి చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడదే జాబితాలో చేరారు భారతీయ జనతా పార్టీ సీినియర్ నాయకుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
యోగి ఆదిత్యనాథ్ పేరు మీద ఉత్తర ప్రదేశ్లో తాజాగా ఓ గుడి వెలిసింది. అయోధ్య జిల్లాలోని భరత్కుండ్ సమీపంలో గల మౌర్య కా పూర్వ గ్రామంలో ఈ గుడిని నిర్మించారు ఓ వీరాభిమాని. ఆయన పేరు ప్రభాకర్ మౌర్య. ఆలయంలో యోగి ఆదిత్యనాథ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నిత్యం పూజలు చేస్తోన్నారు. ధూప, దీప, నైవేద్యాలతో కొలుస్తోన్నారు. శ్రీరామచంద్రుడిగా యోగి విగ్రహాన్ని తయారు చేయించారాయన.
ఎడమ భుజానికి అమ్ములపొది, కుడి చేతిలో విల్లును ధరించిన ఆకారంలో యోగి ఆదిత్యనాథ్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. యోగి ఆదిత్యనాథ్ ఎత్తుకు సమానంగా దీన్ని తయారు చేయించడం స్పెషాలిటీ. ప్రతిరోజూ ఉదయం, సాయంత్ర సమయాల్లో యోగి విగ్రహానికి పూజలు చేస్తుంటారు. ఆయన పేరు మీద భక్తి గీతాలను పాడుతుంటారు. ప్రభాకర్ మౌర్య సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. దీనికి వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు.
యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్నీ ఈ ఆలయ నిర్మాణ కోసం ఖర్చు చేశానని, ఆ డబ్బులతోనే పూజాదికాలను నిర్వహిస్తోన్నానని చెప్పారు. అయోధ్య ధామ్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ మౌర్య కా పూర్వ గ్రామం. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేసిన రోజు- అదే ముహూర్తంలో ప్రభాకర్ మౌర్య.. యోగి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.