రైతును వెంటాడి చంపేసిన పులి
మైసూరు: పోలం దగ్గర పశువులు మేపుకుంటున్న రైతును పులి వెంటాడి చంపేసిన సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు సమీపంలో జరిగింది. నంజనగూడు తాలుకా హెడియాల గ్రామంలో నివాసం ఉంటున్న నాగరాజు (38) అనే రైతు పులి దెబ్బకు బలి అయ్యాడు.
వాదాయనపుర గ్రామం సమీపంలో నాగరాజు, వెంకటేష్, శివన్న అనే ముగ్గురు రైతులు పొలం దగ్గర పశువులు మేపుకుంటున్నారు. ఆ సందర్బంలో ఆహారం కోసం అటవి ప్రాంతం నుంచి పొలం దగ్గరకు వెళ్లిన పులి వీరి మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించింది.
ముగ్గురూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశారు. అయితే వారిని వెంటాడిన పులి నాగరాజును పట్టుకుని ఎత్తుకెళ్లి అటవి ప్రాంతం సమీపంలో చంపేసింది. శివన్న, వెంకటేష్ చెట్లు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. విషయం తెలుసుకున్న అటవి శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అధికారులు నాగరాజు కుటుంబ సభ్యులకు రూ. రెండు లక్షల నష్టపరిహారం చెక్కు ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రూ. 10 లక్షల నష్టపరిహారం, నాగరాజు పిల్లలు అశ్విని, హర్షన్ కు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చివరికి అటవీ శాఖ అధికారులు రూ. ఐదు లక్షల నష్టపరిహారం, అశ్వినికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామి ఇవ్వడంతో గ్రామస్తులు కొంచెం శాంతించారు. నాగరాజు చనిపోయిన కొన్ని గంటల తరువాత అటవి శాఖ అధికారులు వచ్చారని గ్రామస్తులు ఆరోపించారు.