ఈద్గా మైదానంలో కాంగ్రెస్ లేడీ లీడర్ గొప్పలు చెప్పింది: మండిపడిన ముస్లీం మతపెద్దలు !
బక్రీద్ పర్వదినం రోజు దైవప్రీతి కోసం తన ధనాన్ని, ప్రాణాన్ని, సంతానాన్ని, సమస్తమూ త్యాగం చెయ్యడానికి సిద్దం అని ముస్లీం సోదరులు నిరూపించుకుంటారు.
బెంగళూరు: బక్రీద్ పర్వదినం రోజు దైవప్రీతి కోసం తన ధనాన్ని, ప్రాణాన్ని, సంతానాన్ని, సమస్తమూ త్యాగం చెయ్యడానికి సిద్దం అని ముస్లీం సోదరులు నిరూపించుకుంటారు. బక్రీద్ పండుగ రోజు ఈద్గా మైదానంలో ముస్లీం సోదరులు ప్రత్యేకంగా నమాజ్ చేసి అల్లాను ప్రార్థిస్తారు.
ఈద్గా మైదానంలో ప్రార్థనలు చెయ్యడానికి ముస్లీం సోదరులు, పిల్లలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ముస్లీం మహిళలను ఈద్గా మైదానంలోకి అనుమతించరు. శనివారం జరిగిన బక్రీద్ పండగ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు ఈద్గామైదానంలో అడుగుపెట్టి తాను చేసిన అభివృద్ది గురించి గొప్పలు చెప్పుకున్నారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర తాలుకా ఆనందపుర సమీపంలోని ఆచాపుర ఈద్గా మైదానంలోకి శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జిల్లా పంచాయితీ సభ్యురాలు అనితాకుమారి వెళ్లారు. ముస్లీం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోకుండా జిల్లా పంచాయితీ పరిధిలోని తన మన ప్రాంతంలో జరిగిన అభివృద్ది పనుల గురించి వివరిస్తూ ఈద్గా మైదానంలోనే లెక్చర్ ఇవ్వడం మొదలు పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అనితాకుమారి తీరుపై ముస్లీం ప్రముఖులు బహిరంగంగానే విమర్శించారు. ఈద్గా మైదానంలోకి పురుషులు, పిల్లలకు మాత్రమే అనుమతి ఉందని, మా మతానికి చెందిన మహిళలను అనుమతించమని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జిల్లా పంచాయితీ సభ్యురాలు అనితాకుమారి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈద్గా మైదానంలో అడుగుపెట్టి ప్రసంగాలు చేశారని, మా ఆచారాలను మంటకలపడానికి ప్రయత్నించారని ఆచాపుర మసీదు సమితి కార్యదర్శి కలీముల్లా ఖాన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అనితాకుమారి మీద పలువురు ముస్లీం మతపెద్దలు మండిపడుతున్నారు.