టవర్ పైకెక్కి ఆప్ నేత హల్ చల్ - డిమాండ్ నెరవేర్చాలంటూ..!!
ఢిల్లీలో ఆప్ నేత హల్ చల్ చేసారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెల 4న జరగనున్నాయి. ఇప్పటికే పోటీలో నిలిచే అభ్యర్ధుల జాబితాను బీజేపీ..ఆప్ విడుదల చేసాయి. బీజేపీ నుంచి 232 మంది అభ్యర్ధుల జాబితా విడుదల అయింది. వీరిలో 126 మంది మహిళలు, ముగ్గురు ముస్లింలు, ఏడుగురు సిక్కులు, తొమ్మది మంది మాజీ మేయర్లు సైతం ఉన్నారు. ఆప్ నుంచి 250 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అయితే, ఇప్పుడు టికెట్ దక్కలేదనే కారణంగా ఆప్ నేత ఢిల్లీలోని శాస్త్రి పార్క్ వద్ద చేసిన హంగామా వార్తల్లో నిలిచింది.
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్-హసన్ ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ, దక్కక పోవటంతో ఆయన ఆందోళనకు దిగారు. ఓ ట్రాన్స్మిషర్ టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. తుది జాబితా విడుదల చేసిన ఆప్ 117 మందిని ఖరారు చేసింది. ఇదే చివరి జాబితా కావటంతో ఇక తనకు టికెట్ రాదని హసన్ నిర్ణయానికి వచ్చారు. దీంతో, ఈ నిరసనకు దిగారు.

అయితే, ఆప్ నేతలు మాత్రం టికెట్ల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించామని చెబుతున్నారు. ప్రజా వాణే పార్టీ వాణి అని, సర్వేలో ప్రజలు సూచించిన పార్టీ పాత కర్యకర్తలకే రెండో జాబితాలో చోటు కల్పించినట్టు ఆప్ ప్రకటించింది. టిక్కెట్ల పంపిణీలో పార్టీ కోసం కష్టపడిన 117 మందికి పైగా పాత కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చినట్టు తెలిపింది. టిక్కెట్ను ఆశిస్తూ 20,000 మందికి పైగా ఆప్ కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అధ్యక్షతన ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సుదీర్ఘ సమావేశం జరిపి అభ్యర్థులను ఖరారు చేసింది.
అటు బీజేపీకి గుజరాత్ ఎన్నికల్లోనూ ఆప్ గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే గుజరాత్ ఎన్నికలతో పాటుగా ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికల్లో నూ ఆప్ ఏ మేర సత్తా చాటుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications