షీలా దీక్షిత్ ఎఫెక్ట్: రాహుల్ గాంధీపై కేజ్రీవాల్ పార్టీ పోటీ!
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, పదిహేనేళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేసిన షీలా దీక్షిత్ను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓడించడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో కాంగ్రెసు పార్టీ అగ్రనేతల పైన పోటీ చేసేందుకు ఆ పార్టీ ఉత్సాహం చూపుతోంది.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన పోటీకి ఎఎపి సై అంటోంది. తమ పార్టీకి చెందిన నేత కుమార్ విశ్వాస్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాహుల్ గాంధీ పైన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాహుల్తో పాటు ఆయా పార్టీల అగ్రనేతల పైన తమ అభ్యర్థులను పోటీకి దింపేందుకు కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు.
అగ్రనాయకుల పైన తమ పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు వెనుకాడబోమని ఎఎపి నాయకులు మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు. ఢిల్లీలో ఎఎపి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా సిసోడియా పై వ్యాఖ్యలు చేశారు.
ఎఎపి ముంబైతో పాటు పలు ప్రాంతాల పైన దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. అవినీతిని వ్యతిరేకించే కాంగ్రెసు, బిజెపిలలో ఉన్న నేతలు తమ పార్టీలో చేరవచ్చునని కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే తాము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి విరాళాలు ఇవ్వాలని కోరారు.